దేశంలో 'మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్' గా.. మళ్లీ తెలంగాణే
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ అవలంభిస్తోన్న విధి విధానాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ సీ.ఎన్.బీ.సీ టీవీ-18 మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం విశేషం. ఈ సంస్థ నుంచి ఇదే విభాగంలో తెలంగాణ రాష్ట్రం రెండోసారి అవార్డును అందుకోబోతుండడం మరో విశేషం.
ఆయా రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల పరిస్థితులు, అందుకోసం రాష్ట్రాలు అవలంభిస్తోన్న విధానాలను పరిగణలోకి తీసుకుని ప్రతీ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది సీ.ఎన్.బీ.సీ. ఇదే క్రమంలో ఈ ఏడాది కాను ప్రకటించిన 'ఇండియా బిజినెస్ లీడర్స్' అవార్డుల్లో భాగంగా తెలంగాణ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికయింది.
అవార్డును స్వీకరించాల్సిందిగా ఇప్పటికే సీఎన్ బీసీ నుంచి తెలంగాణ సర్కార్ కు ఆహ్వానం అందగా.. ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ అవార్డును స్వీకరించబోతున్నారు. అగస్టు 30వ తేదీన గ్రాండ్ న్యూఢిల్లీలో ఉన్న వసంత్ కుంజ్ ఫేస్ 2లో సాయంత్రం 5.30గం.లకు జరగబోయే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. కాగా, ఈ కార్యక్రమం కోసం.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సహా పలువరు నేతలు హాజరుకానున్నారు.