గ్లామర్ పాలిటిక్స్ దిశగా తెలంగాణ కాంగ్రెస్..! : 'పీసీసీ చీఫ్ గా అజారుద్దీన్..?'
న్యూఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి హైమాండ్ సర్జరీ మొదలుపెట్టినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జీ దిగ్విజయ్ ను తప్పించే యోచనలో కాంగ్రెస్ ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లోను భారీ మార్పులకు హైకమాండ్ శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో అధికార పార్టీ దూకుడుకి కళ్లెం వేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సీఎల్సీ నేత జానారెడ్డిని పదవుల నుంచి తప్పించే దిశగా కాంగ్రెస్ కార్యచరణ మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ ని ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు గ్లామర్ పాలిటిక్స్ వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ కి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలనే వాదన తెరపైకి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అజారుద్దీన్ కి బాధ్యతలు అప్పగించడం ద్వారా మైనారిటీ ఓటర్లను కూడా ఆకర్షించే అవకాశం ఉండడంతో పాటు అజారుద్దీన్ క్రికెట్ గ్లామర్ కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త మైలేజ్ ఇవ్వవచ్చనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, పీసీసీ చీఫ్ రేసులో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్నవాళ్లకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని యోచిస్తున్న కాంగ్రెస్ ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇవన్నీ ఊహగానాలకే పరిమతమవుతాయా.. లేక నిజంగానే కాంగ్రెస్ భారీ మార్పులు చేయడానికి రెడీ అవుతోందా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.