సచివాలయం కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ : రేపు విచారించనున్న కోర్టు
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని నిరసిస్తూ సిఎల్ పి ఉప నాయకుడు జీవన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదే అంశంపై అదే పార్టీకి చెందిన ఎంఏల్ఏ కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి కూడ కోర్టును ఆశ్రయించారు.ఈ అంశంపై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని యోచిస్తోందని, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.వాస్తు దోషం కారణంగా పటిష్టమైన సచివాలయ భవనాలను కల్చివేయకూడదంటూ జీవన్ రెడ్డి ఇప్పటికే సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు.అమరావతి నుండి ఎపి పాలన సాగుతోన్నందున..ఎపికి కేటాయించిన బ్లాకులు కూడ తెలంగాణ వాడుకోనేందుకు వీలు కలుగుతోందని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతమున్న సచివాలయంలో అన్ని రకాల వసతులున్నాయన్నారు. వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన వల్ల కోట్లాది రూపాయాలు ప్రజలపై భారం పడుతోందన్నారు.ఈ అంశాలను ప్రస్తావిస్తూ సిఎల్ పి ఉప నేత జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.ఈ విషయమై కోర్టు విచారణను శుక్రవారం చేపట్టనుంది.