కెసిఆర్ని ఢీకొట్టే సత్తా జగ్గారెడ్డికే: ఆకాశానికెత్తిన సీనియర్లు, వాళ్లూ ఆంధ్రావారే: టిడిపి కౌంటర్
మెదక్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆయనను ఆకాశానికెత్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్కు గట్టిగా ఢీకొనగల ధైర్యం జగ్గారెడ్డికే ఉందని, కిష్టా రెడ్డి లేని లోటును తీరుస్తారని ప్రశంసలు కురిపించారు.
జగ్గారెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు డికె అరుణ, దామోదర రాజనర్సింహ, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి తదితరులు మాట్లాడారు. జగ్గారెడ్డిని ఆకాశానికెత్తారు.
టిఆర్ఎస్కు గట్టి సమాధానం చెప్పే సత్తా జగ్గారెడ్డికే ఉందని ఒకరు అంటే, కిష్టా రెడ్డి లేని లోటును తీరుస్తారని మరొకరు, చెప్పిన మాటకు కట్టుబడే వ్యక్తి అని ఇంకొకరు, జగ్గారెడ్డి రాకతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని.. ఇలా ప్రశంసించారు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలని డికె అరుణ అన్నారు. జగ్గారెడ్డి రాకతో కాంగ్రెస్ బలం పెరిగిందని సురేష్ షెట్కార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జానా రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాకు అందరు కృతజ్ఞతలు చెప్పాలన్నారు.
మెదక్ జిల్లాలో కిష్టారెడ్డి లేని లోటును జగ్గారెడ్డి తీరుస్తారని గీతా రెడ్డి అన్నారు. టిఆర్ఎస్కు గట్టి సమాధానం చెప్పే సత్తా జగ్గారెడ్డికే ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వానివి మాటల మూటలే తప్ప ఏమీ లేదని దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ నుంచి కెసిఆర్ వంటి దుష్టశక్తిని తరిమి కొట్టాలన్నారు.
నోటికి వచ్చిన మాటలు చెబుతూ కెసిఆర్, ప్రధాని మోడీలు కాలం వెళ్లదీస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చెప్పిన మాటకు కట్టుబడే వ్యక్తి జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో జగ్గారెడ్డి ముందుంటారన్నారు.
మాయ మాటలతో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న చరిత్ర మెదక్ జిల్లాది అన్నారు. రుణమాఫీ రైతులకు గుదిబండలా మారిందని, వడ్డీల పైన వడ్డీలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ ఎంపీ రేసులో నేను లేను: దామోదర
కాంగ్రెస్కు టీమ్ వర్క్ అవసరమని దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ లోకి వెళ్లిన డీఎస్ కోవర్టిజానికి ఆద్యుడన్నారు. వరంగల్ లోకసభ నియోజకవర్గానికి తాను పోటీ చేయడంలేదని వెల్లడించారు. దొరలను ఎదుర్కొనేది ఎప్పటికైనా దళితులేనన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నామన్నారు.
ఆంధ్రా పేర్లొద్దు.. వాళ్ల పెట్టుబడులు ముద్దా: శ్రీనివాస్ గౌడ్కు నన్నూరి కౌంటర్
పార్లమెంటరీ కార్యదర్శి పదవి పోయాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా ఉందని టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. ఆంధ్ర నేతల పేర్లు, విగ్రహాలు వద్దు కానీ ఆంధ్ర పెట్టుబడులు ముద్దు అయ్యాయా అని కౌంటర్ ఇచ్చారు.
ట్యాంకు బండు పైన ఆంధ్ర నేతల విగ్రహాలను తొలగించి లారీల్లో పంపిస్తామని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారని, కెబిఆర్, సంజవయ్య పార్కుల పేర్లను మారుస్తామని చెబుతున్నారని, మరి ఆంధ్ర పెట్టుబడులు, పరిశ్రమలు గానీ తెలంగాణకు అవసరం లేదని ప్రకటిస్తారా అని సవాల్ చేశారు.
ఏపీకి చెందిన చినజీయర్ స్వామి యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా నామకరణం చేశారని, ఆ పుణ్య క్షేత్రానికి చీఫ్ ఆర్కిటెక్ట్గా విజయనగరానికి చెందిన ఆనందసాయిని ప్రభుత్వం నియమించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.