కేసీఆర్ చీప్ లిక్కర్కు వ్యతిరేకం, కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్: భట్టి
హైదరాబాద్: చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆలోచనను వ్యతిరేకిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని టీపీసీసీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
చీప్ లిక్కర్పై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జిల్లా కమిటీలతో చర్చించి తేదీలు ప్రకటిస్తామన్నారు. అదే విధంగా జాతీయ హోదా వచ్చే అవకాశమున్న ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చడాన్ని కూడా తప్పుబట్టారు.
పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్వలాభం కోసమే సీఎం ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తయితే వాటర్ గ్రిడ్ పథకం అవసరం లేదని తెలిపారు.
వాటర్ గ్రిడ్కు రూ.36 వేల కోట్లు వెచ్చించడం రాష్ట్రంపై ఆర్థిక భారమేనన్నారు. కొన్ని పైప్ లైన్ల కంపెనీలు, కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అనాలోచిన నిర్ణయాల వల్లనే మెట్రో రైలు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
చీప్లిక్కర్పై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం: నాయిని
చీప్లిక్కర్పై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల సూచనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. గుడుంబా నియంత్రణే ప్రభుత్వ లక్షమని చెప్పిన ఆయన హైదరాబాద్ను డల్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.