కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రాంరెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు పిఏసి చైర్మన్గా పని చేస్తున్నారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రాంరెడ్డి వెంకట రెడ్డి కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కెసిఆర్, ఖమ్మం జిల్లా నేతలు, ఇతర పార్టీలు సంతాపం తెలిపారు.
సుజాత నగర్ నియోజకవర్గం నుంచి...
గతంలో సుజాత నగర్ నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వెంకట్ రెడ్డి 2009, 2014లలో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నెల రోజుల క్రితం శ్వాస సంబంధ వ్యాధితో కిమ్స్లో చేరారు. అమెరికాలోను చికిత్స పొందారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు.
ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1999, 2004 నుంచి అక్కడి నుంచే గెలుపొందారు.