సీఎం కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కె. చంద్రశేఖరరావే అంటూ ఆయనపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రలో రైతాంగ సమస్యలపై రాష్ట్ర సీఎం కె. చంద్రశేఖరరావుకు జీవన్ రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు దృష్టిపెట్టాలని కేసీఆర్కు ఆయన ఆ లేఖలో సూచించారు.
చట్టప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 54 శాతం విద్యుత్ రావడం లేదని, వ్యవసాయానికి కనీసం 3 గంటల విద్యుత్ కూడా అందడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు సాధించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.
ఆత్మస్ధైర్యం కోల్పోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, సమస్యకు కారణమెవరైనా ఇబ్బంది పడుతున్నది రైతులేనని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధాన్యం క్వింటాళ్లకు రూ. 100 చొప్పున చెల్లించాలని.. కేసీఆర్ సర్కారును డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్పై కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్కు విక్షప్తి చేశారు.
సాగర్ లో విద్యుదుత్పత్తి నిలిపివేత
నాగార్జున సాగర్లో విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కారు ఆదివారం మధ్యాహ్నం నిలిపివేసింది. అల్ప పీడన ద్రోణి కారణంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో పాటు విద్యుత్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో జెన్ కో అధికారులు సాగర్ వద్ద విద్యుదుత్పత్తిని నిలిపివేశారు.