అధిర్ చౌధురి సస్పెన్షన్: లోకసభలో టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లోక్సభ నుంచి ఒక రోజు పాటు సస్పెన్షన్కు గురయ్యారు. ఢిల్లీ హైకోర్టు (సవరణ) బిల్లు-2015పై సభలో చర్చ జరుగుతుండగా సోమవారంనాడు అధిర్ తన చేతిలోని ప్లకార్డుతో పోడియంలోకి దూసుకువచ్చి స్పీకర్ టేబుల్ మీద మోదుతూ అంతరాయం కలిగించారు.
ఆ సమయంలోనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సిఎంలు వసుంధరా, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తొలుత సభను గంటపాటు వాయిదా వేశారు.
భ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అధిర్ రంజన్ తన ప్రవర్తనకు గాను క్షమాపణలు చెప్పాలని బిజెపి సభ్యులు పట్టుబట్టారు. అయితే ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో ఎట్టకేలకు చౌధురిని ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పి, తాను లక్ష్మణ రేఖ దాటానని ఒప్పుకున్నారు.
కాగా, హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లెమంటు సభ్యులు లోకసభలో ఆందోళనకు దిగారు. హైకోర్టును వెంటనే విభజించాలని కోరుతూ వారు లోకసభలో ప్లకార్డులు ప్రదర్శించారు. లోకసభ వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.