డీఎస్ వెళ్లినా డోంట్కేర్: 9సార్లు టికెటిస్తే 3సార్లే గెలిచారు, బుజ్జగించొద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్న డీ శ్రీనివాస్ పైన కాంగ్రెసక్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. డీఎస్ టీఆర్ఎస్లో చేరుతున్నారన్న వార్త తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు. వెళ్లే సరికి ఆయన లేరు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... డీఎస్ను కలిసి మాట్లాడుదామనుకున్నామని, తమను రమ్మని పిలిచి ఆయన ఇంట్లో లేనప్పుడు ఏం మాట్లాడుతామని ప్రశ్నించారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం పచ్చి మోసమేనని వీ హనుమంత రావు అన్నారు.
కాగా, డీఎస్ను బుజ్జగించవలసిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ నేతలకు సూచించారని సమాచారం. డిగ్గీ పార్టీ సీనియర్లకు ఫోన్ చేశారు. డీఎస్ను బుజ్జగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయనకు తొమ్మిదిసార్లు టిక్కెట్ ఇస్తే మూడుసార్లే గెలిచారని, వరుసగా మూడుసార్లు ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపు వద్దని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఆ ప్రయత్నాలు చేయలేదు. డీ శ్రీనివాస్ పార్టీని వీడుతారని భావించలేదని తెలంగాణ కాంగ్రెస్ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు డీఎస్ పైన నిప్పులు చెరుగుతున్నారు.