వర్షాల ఎఫెక్ట్: కేసీఆర్కు పోటీగా 'వైయస్సార్', హైదరాబాద్కు మాత్రం దూరం
హైదరాబాద్: భారీ వర్షాలు తెలంగాణ రాష్రంలో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త వివాదాన్ని తీసుకు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు నిండాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ క్రెడిట్ను ఎవరికి వారు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్
భారీ వర్షాల కారణంగా తెలంగాణలో చెరువులు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని, ఇందుకు తాము చేపట్టిన మిషన్ భగీరథనే కారణమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, కాబట్టే వర్షాల కారణంగా చాలా చెరువులు నిండాయని చెబుతున్నారు.
హరీష్ రావు
మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణ వల్లే ప్రాజెక్టులు, చెరువులు నిండాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. మొత్తానికి తాము చేపట్టిన కార్యక్రమాల వల్లనే వర్షాల కారణంగా తెలంగాణలో నీటి కళకళ కనిపిస్తోందని ఆయన చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి
అధికార తెరాస వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన వాటి వల్లే ప్రాజెక్టులు నిండాయని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 26 ప్రాజెక్టులు కట్టిందని చెప్పారు.
మల్లు రవి
తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్లే ఈనాడు తెలంగాణ నీటితో కళకళలాడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. తమ హయాంలో పాలమూరు - రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం తదితర ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని మల్లు రవి ఈ సందర్భంగా చెప్పారు.
రోడ్లు
ఇదిలా ఉండగా, ప్రాజెక్టుల కళకళ పైన అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అదే సమయంలో హైదరాబాదులో దెబ్బతిన్న రోడ్ల గురించి మాత్రం పరస్పరం విమర్శలు చేసుకోవడం గమనార్హం. గత ప్రభుత్వాల వల్లే ఇప్పుడు హైదరాబాదులో రోడ్ల పరిస్థితి ఇలా ఉందని, అలాగే ఆక్రమణలు జరిగి ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయని తెరాస నేతలు మండిపడుతున్నారు. తెరాస అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోందని, రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, కేటీఆర్ మంత్రిగా విఫలమయ్యారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.