విమలక్కపై కుట్ర అభియోగాలు: ఆయుధాల కేసు
నిజామాబాద్: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో-చైర్మన్, అరుణోదయ గాయని విమలక్క, అమె భర్త అమర్, తదితరులపై నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో కుట్ర కేసు నమోదైంది. విమలక్క సారథ్యంలోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) బీడీకార్మికుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో మార్చి 23 భగత్సింగ్ వర్ధంతి సందర్భంగా బీడీ కార్మికులతో నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో సభను నిర్వహించారు. 10 జిల్లాల నుంచి టఫ్ కార్యకర్తలు, అరుణోదయ సభ్యులతోపాటు ఏఐఎఫ్టీయూ, అనుబంధ శ్రామికశక్తి బీడీ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారు.
సామ్రాజ్యవాదుల కోసమే వనరులను తరలిస్తున్నారని విమలక్క సభావేదికగా గళం విప్పారు. ఈ క్రమంలో నిజామాబాద్లో బీడీ వర్కర్స్ యూనియన్ నేతలు వెంకటలక్ష్మి, అనుసూయ, లింగయ్యలను అరెస్ట్ చేశారు. వీరి విడుదల కోసం విమలక్క జిల్లా ఎస్పీని కలిశారు. నిజామాబాద్ ఎంపీ కవితను కలిసేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రయత్నాలు సాగుతుండగానే గత నెల 26వ తేదీన విమలక్కకు నిజామాబాద్ పోలీసులు ఫోన్ చేశారు. కుట్ర, ఆయుధాల కేసు నమోదు చేసినట్టు చెప్పారు. విమలక్కతోపాటు ఆమె భర్త అమర్, జనశక్తి అగ్రనేత రాజన్న సహా 17 మందిపై మారణాయుధాలు, కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు.
2011లో నిజామాబాద్ జిల్లాలో ‘దేవునిపల్లి కుట్రకేసు' నమోదైంది. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నవారికి బెయిల్ ఇచ్చారు. విమలక్కకు బెయిల్ వచ్చినా విడుదల చేయకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆ సమయంల ఉద్యమం ఉధృతంగా ఉంది. అప్పట్లో ఆమె కోసం ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మించారు. ఆయన కృషికి లాయర్ల పట్టుదల తోడు కావడంతో విమలక్క విడుదలయ్యారు. ఆ తరువాత 'దేవునిపల్లి కు ట్ర కేసు'ను కోర్టు కొట్టివేసింది. విచిత్రంగా ఏడాది తరువాత నూతన రాష్ట్రంలో అదే జిల్లాలో ఆమెపై ‘మాచారెడ్డి కుట్ర కేసు‘ దాఖలైంది.
విమలక్కపై వంటి ప్రజా కళాకారులపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి, వేధించడం సరికాదని తెలంగాణ విద్యావంతులు, మేధావులు, హక్కుల నేతలు గర్హించారు. కుట్ర, ఆయుధాల అభియోగాలను ఉసంహరించుకోవాలంటూ 32 మంది సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసినవారిలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావేత్త చుక్కా రామయ్య, కేశవరావు జాదవ్, రమా మెల్కొటే, ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదిత రులున్నారు.