మహిళపై కానిస్టేబుల్ రేప్ యత్నం, తీవ్ర దాడి
హైదరాబాద్: సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. గౌరవ ప్రదమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ కానిస్టేబుల్ మహిళపై అత్యాచార యత్నం చేశాడు. అంతేకాకుడా ప్రతిఘటించిన ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కీసర మండల పరిధిలోని దుమ్మాయిగూడకు చెందిన ఓ మహిళ (35) ఈసీఐఎల్లోని తులసి ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. గురువారం రాత్రి విధులు ముగించుుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్స్టాప్ వద్ద ఆటో ఎక్కింది.
అప్పటికే ఆటోలో ఉన్న శ్రీనివాసులు ఆమెతో మాటలు కలిపి, ఆటోను దుమ్మాయిగూడ కాకుండా చీర్యాల గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాలని డ్రైవర్కు సూచించాడు. అనంతరం మహిళకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది.
దీంతో ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలోని పొలాల రైతులు అక్కడికి వచ్చి కానిస్టేబుల్ శ్రీనివాసులను నుంచి మహిళను రక్షించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.