నయీం సైన్యంలో టెక్ మధుకే ఎక్కువ జీతం, వేలాది కోట్లు ఎక్కడ దాచాడు?
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం డ్రైవర్ ఫయీజ్, అతని భార్య, మరో నలుగురు అనుచరులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. నయీం కేసులో ఏ2 నిందితుడు ఫయీం ఇచ్చిన సమాచారంతో హైదరాబాదులోని మైలార్ దేవుపల్లిలోని రోషన్ కాలనీలో శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నయీం డ్రైవర్, అతని భార్య, మరో నలుగురు కీలక అనుచరులు పట్టుబడ్డారు.
టెక్ మధుకు సాఫ్టువేర్ జీతం
నయీం తన నేర సామ్రాజ్యం కోసం ఓ ప్రయివేటు సైన్యాన్ని నడిపిన విషయం తెలిసిందే. నయీం గ్యాంగ్లో దాదాపు రెండు వందల మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఒక్క నల్గొండ, భువనగిరి ప్రాంతాల్లోనే ఎనభై మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు ఇప్పటి దాకా మొత్తం నలభై మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. నయీం గ్యాంగ్లో ఖాళీగా తిరిగే వారి నుంచి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల వరకు ఉన్నారని తెలుస్తోంది.
అనుచరులు ఇచ్చే సమాచారం, వారు స్థానికంగా తనకోసం చేసే పనుల్ని బట్టి తన గ్యాంగ్లోని ప్రతి సభ్యునికి కొంత నెలనెలా కొంత మొత్తాన్ని నయీం చెల్లించేవాడు. ఎవరెవరికి ఎంత చెల్లిస్తున్న విషయాన్ని నయీం ఎప్పటికప్పుడు తన డైరీలో రాసుకున్నాడు.
చత్తీస్గఢ్లో తన గ్యాంగ్ కార్యకలాపాలను పర్యవేక్షించే టెక్ మధుకే అత్యధికంగా ప్రతి నెల రూ.80 వేల వరకు నయీం చెల్లించే వాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టు కదలికలు పెద్దగా లేకపోవడంతో ఒడిసా, ఛత్తీస్గఢ్వైపు దృష్టి పెట్టిన నయీం.. టెక్మధు సహకారంతో అక్కడ ప్రత్యేక గ్యాంగ్ను నడిపినట్లుగా తేలింది.
కోర్టు అనుమతితో ఫయీంను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఛత్తీస్గఢ్, ఒడిశాలోని సభ్యుల సమాచారాన్ని రాబడుతున్నారు. నయీంకు కుడిభుజంగా వ్యవహరించిన శేషన్నకోసం పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నారు.
నయీం ప్రతి కదలిక తెలిసిన ఫయీంతోపాటు టెక్ మధుకు శేషన్న సమాచారం కూడా తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ నయీం గ్యాంగ్ సభ్యుల్ని పోలీసులు గుర్తించారు. పాతబస్తీకి చెందిన నయీం అనుచరుడు యూసు్ఫను పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. అలాగే, నయీం కోట్లాది రూపాయల డబ్బును దాచిన ప్రదేశాన్ని గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.