నయీం కేసులో ప్రముఖులకు నోటీసులు! లిస్ట్ నుంచి వారిని తప్పించారు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాఫ్తు కీలక ఘట్టానికి చేరుకుంటోంది. నయీం కేసు దర్యాఫ్తు చేస్తున్న సిట్ మరికొందరు ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే నయీంతో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు తాఖీదులు ఇవ్వనుంది.
నయీం అరాచకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ముఖ్యమైన వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సిట్.. అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు లభించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు డిజిపి అనురాగ్ శర్మ నివేదిక అందించారు.
భూకబ్జాలకు, బెదిరింపులకు ఎవరెవరు సహకరించారో, ఎలా సహకరించారో నయీం తన డైరీలో రాసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఓ ఎమ్మెల్సీ, నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని సిట్ యోచిస్తోందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వారికి సంకేతాలు కూడా అందాయట.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొందరు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదిత లిస్టులో అర్హతలున్నప్పటికి ఒకరిద్దరు అధికారులను పక్కన పెట్టారని అంటున్నారు. అందుకు నయీం కేసే కారణమని అంటున్నారు.