ఉద్యోగులే టార్గెట్: రూ. లక్షలు టోకరా వేసిన కిలాడీ జంట
హైదరాబాద్: అమాయక ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా ఓ కిలాడీ జంట రూ. లక్షల్లో మోసాలకు పాల్పడింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. సున్నా శాతం వడ్డీకే రుణాలిస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరు నిందితులు అంజలి, నర్సింగరావులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం తెలిపారు.
ఏసీపీ రఘువీర్ ఈ ఘటననుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఆర్డీఎల్ ఉద్యోగి భూజేష్గౌడ్ నిందితులు ఇచ్చిన ప్రకటన చూసి ఫోన్ చేశాడు. దీంతో బజాజ్ షోరూంలో రూ.80వేల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తే.. 12 వాయిదాల్లో జీరో ఫైనాన్స్ కింద వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నారని, రూ.30వేలు తాము చెల్లిస్తాం, మిగిలిన రూ.50 వేలు మీరు 12వాయిదాల్లో కట్టేసుకోండి అంటూ అంజలి.. భూజేష్కు వివరించారు.
ఆమె మాటలు నమ్మిన భూజేష్గౌడ్ నాగోల్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్లో రూ.80వేల విలువైన సోనీ టీవీ, వోల్టాస్ కూలర్ కొనుగోలు చేశాడు. అదేరోజు అంజలికి ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. 'రసీదు వివరాలు రాసుకుని.. టీవీ, కూలర్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి. రూ.30వేలు షోరూం వారికి, రూ.50వేలు మీకు ఇచ్చి టీవీ, కూలర్ తీసుకుంటాం' అని ఆమె అతనికి వివరించింది.
టీవీ, కూలర్ వచ్చిన రోజు భూజేష్గౌడ్ ఆమెకు ఫోన్ చేయగా... నరసింహరావు అనే వ్యక్తిని పంపించింది. అతను వచ్చి రూ.30వేలు షోరూం వ్యక్తికి ఇచ్చి టీవీ కూలర్ తీసుకున్నాడు. రూ.50వేలు అరగంటలో తెచ్చిస్తానని చెప్పి మళ్లీ రాలేదు.
దీంతో కంగారుపడిన భూజేష్.. అంజలికి ఫోన్ చేయగా ఆమె సెల్ఫోన్ పని చేయలేదు. మోసపోయానని గ్రహించిన భూజేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులు అంజలి, నరసింహరావును ఎస్సై హరిభూషణ్రావు బృందం అరెస్ట్ చేసింది. అనంతరం నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నిందితులది ఇదే తొలి మోసమా, లేక వారి బారిన పడిన బాధితులు మరింత మంది ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.