తప్పుడు రాతలని నమస్తే తెలంగాణ ప్రతుల దగ్ధం
వరంగల్: వరంగల్ జిల్లాలోని మానుకోటలో సీపీఐ ఆధ్వర్యాన నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను శనివారం దగ్ధం చేశారు. తమ పార్టీపైన, జిల్లాశాఖ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావుతోపాటు మరో నేత మేకల రవిమీద ప్రచురితమైన కథనాలకు నిరసనగా నెహ్రూ సెంటర్లో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ నేతలు మాట్లాడారు. పేదల పక్షాన నిలిచే సీపీఐ నేతలపై సర్కారుకు వత్తాసు పలికే పత్రిక వక్ర కథనాలు ప్రచురించడం గర్హనీయమన్నారు. తెలంగాణలో సాయుధ పోరాటాలు నిర్వహించి 10 లక్షల ఎకరాలను పంచిన చరిత్ర కమ్యూనిస్టులకుందని గుర్తు చేశారు.
జీప్లస్ వన్ పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రావు వ్యవహరిస్తున్నారన్నారు.
అలాగే కేసముద్రంలోనూ ఆ పత్రిక ప్రతులను సీపీఐ నేతలు తగులబెట్టారు. యువ కమ్యూనిస్టులను బలిపెట్టి నిరుపేద రైతులకు భూమి పంపిణీ చేసిన ఘన చరిత్రగల సీపీఐపై తప్పుడు కథనాలు రాయడం హేయమన్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న భూ బకాసురులు ఆ పత్రికకు కనబడడంలేదా? అని ప్రశ్నించారు.