పరువు తక్కువ?: 'మోడీ దగ్గర మాట్లాడటం చంద్రబాబుకు చేతకాదు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు చూస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని అంబలి కేంద్రాలు పరువు తక్కువ అనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదానం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉంటే ప్రజలకు కరువు సాయం చేయకుండా.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రధాని మోడీ దగ్గర ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం చేతకాని చంద్రబాబు కమ్యూనిస్టులను తిట్టడం హాస్యాస్పదమన్నారు. ఊసరవెల్లి మాదిరి అధికార పార్టీ నేతలే రంగులు మార్చుతున్నారని ధ్వజమెత్తారు.
'మేం జగన్ వెంటే'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా తాము మాత్రం అధినేత వైయస్ జగన్ వెంటే నడుస్తామని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు నర్సింగ్ యాదవ్, రాంపుల్లయ్య యాదవ్ అన్నారు. కొంతమంది స్వార్థప్రయోజనాలకోసమే పార్టీని వీడి వెళుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడేది లేదని, జగన్ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై ఏపీ రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయంటూ వారు పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 20కి వాయిదా వేశారు. తుది వాదనలు జులై 20నే వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.