నేను చెవికోసుకొంటా, మాటకు కట్టుబడి తల నరుక్కొంటావా? కెసిఆర్ కు నారాయణ సవాల్
నేను మాట మీద నిలబడి చెవి కోసుకొంటా...మరి నీవు కూడ మాటకు కల్లుబడి తల నరుక్కొంటావా? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సవాల్ విసిరారు.
హైదరాబాద్: నేను మాట మీద నిలబడి చెవి కోసుకొంటా...మరి నీవు కూడ మాటకు కల్లుబడి తల నరుక్కొంటావా? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సవాల్ విసిరారు.
వరంగల్ టిఆర్ఎస్ సభలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తాను చెవి కోసుకొంటే అంధవికారంగా ఉంటానేమోనని, ఈ వయస్సులో తననెవరూ లవ్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
కానీ, కెసిఆర్ తల నరుక్కొంటే ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు? గురువారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
విమర్శను సద్విమర్శగా తీసుకొనే గుణం కెసిఆర్ కు లేదన్నారు నారాయణ. కెసిఆర్ కుటుంబం మాత్రమే పోరాటం చేస్తే తెలంగాణ ఏర్పడలేదన్నారు.రాష్ట్ర ప్రజలంతా అకుంఠిత దీక్షతో చేసిన పోరాటం వల్లే రాష్ట్రం సిద్దించిందని చెప్పారు. కెసిఆర్ పనికిమాలినవాడన్నారు. అలాంటి వ్యక్తి తెలంగాణకు నాయకుడు కావడం దురదృష్ఠకరమన్నారు.
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఖర్చులను అమాతంగా పెంచేసి కోట్లు దండుకొంటున్నారని ఆరోపించారు. దోచుకోవడంలోనూ అవినీతిని పాటించే కాంగ్రెస్ కు, టిఆర్ఎస్ కు పెద్దగా తేడాలేదన్నారు. కెసిఆర్ కేబినెట్ లో మహిళలున్నారా అంటే...అసలు మగాళ్ళు ఉన్నారా ? అని జనం అనుమానిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇందిరాగాంధీ లాగే ఏదో పథకాన్ని అక్కడక్కడా అమలు చేసి అధికారంలోకి రావాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. నిరసన తెలుపుతున్న వాళ్ళను నాలుగు గోడల మద్యకు పరిమితం చేశానని కెసిఆర్ సంతోషిస్తున్నారే గానీ, ఈ ఉద్యమం రాష్ట్రమంతా పాకుతోందన్నారు. ఈ నెల 15వ, తేది తర్వాత ఆక్యుపై ధర్నా చౌక్ తర్వాత ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్దం చేస్తామని నారాయణ ప్రకటించారు.