పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్ , కట్నం డబ్బులు ఇవ్వలేక గుండెపోటుతో తండ్రి మృతి
చెన్నారావుపేట :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో కట్నం డబ్బులు చెల్లించలేక ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకొది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని లింగగిరిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది.పెండెం సంతోష్ చికెన్ సెంటర్ , కిరాణ దుకాణం నడుపుతున్నాడు. నవంబర్ 25వ, తేదిన కూతురు వివాహం చేశాడు.
వివాహం సందర్భంగా కూతురుకు రెండులక్షల రూపాయాలను కట్నం ఇస్తానని ఒప్పుకొన్నాడు. పెద్ద నగదు నోట్లు రద్దు కావడంతో కొత్త కరెన్సీని డ్రా చేసుకొనేందుకు బ్యాంకుల్లో ఆంక్షలు ఉన్నాయి. దరిమిలా కొత్త కరెన్సీ కోసం సంతోష్ ఇబ్బందిపడ్డాడు.
ఇప్పటివరకు ఆయన యాభై వేల రూపాయాలను సమకూర్చుకొన్నాడు. ఇంకా లక్షా యాభై రూపాయాలను సమకూర్చుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. సోమవారం ఉదయం లేచిన వెంటనే ఈ డబ్బును ఎలా సమకూర్చుకోవాలనే విషయమై మధనపడ్డాడు.
ఇదే విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. వారు ఆయనను ఆసుపత్రికి తరలించగా మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. వివాహం చేసుకొనే కుటుంబాలకు నగదు డ్రా చేసుకొనేందుకు కొన్ని సడలింపులు ఇచ్చినా, బ్యాంకులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ కారణంగా సంతోష్ డబ్బుల కోసం తీవ్రంగా వేదన చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.