హెటెక్ వ్యభిచారం: అంతా ఆమె కనుసన్నల్లోనే, సూత్రధారి అతనే...
హైదరాబాద్: స్పా, మసాజ్ పార్లర్ల మాటున నడుస్తున్న హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ ప్రాంతాల్లోని నడుస్తున్న స్పా, మసాజ్ సెంటర్ల గుట్టును మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రట్టు చేశాయి.
శనివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని తంత్రస్పా, ఆరా స్పా, సప్త, రివేరా, మోహమ్, బ్లీచ్తో పాటు 9 మసాజ్ సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 34 మంది థాయ్లాండ్ యువతులు, 21 మంది ఈశాన్య రాష్ట్రాల యువతులు, ఒక పంజాబీ అమ్మాయి, 9 మంది హైదరాబాదీ యువతులు పోలీసులకు చిక్కారు.
19 మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా, మసాజ్ కేంద్రాల నుంచి కండోమ్స్, లాప్టాప్స్, కంప్యూటర్స్ 11స్వైపింగ్ మెషీన్స్, 28మొబైల్ ఫోన్లు, రూ.3,38,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.
అతను కీలక సూత్రధారి
ఈ హైటెక్ వ్యభిచార కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారి దాసరి సిద్ధార్థ(32) అని తేలింది. ట్రైపాడ్ వెర్నస్, హీలింగ్ సర్వీసెస్ పేరుతో బంజారాహిల్స్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాడని తేలింది. బంజారాహిల్స్, నందగిరిహిల్స్, హైటెక్సిటీ, బెంగళూరుల్లో 10కి పైగా స్పా, మసాజ్ సెంటర్స్ నిర్వహిస్తున్నాడు. సర్ఫరాజ్ అలి, వినయ్, అజయ్ తదితరులతో కలిసి మసాజ్ కేంద్రాల్లో రహస్య కార్యక్రమాలు సాగిస్తున్నాడు.
2013 వరకు ముంబైలో...
2013 వరకు అతడు ముంబైలో స్పా వ్యాపారం చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో వ్యాపారాన్ని మాదాపూర్కు మార్చాడు. ఇక్కడ శాండ్విచ్మసాజ్, కాక్టైల్ మసాజ్, వీకెండ్ మజా వంటి పేర్లతో కస్టమర్స్ను ఆకర్షిస్తూ వచ్చాడు. సిద్ధార్థపై తమిళనాడులోనూ వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదైంది. ఈ ముఠాకు చెందిన వెంకటరెడ్డి, బాలసుబ్రమణ్యం, తోట విజయ్కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అంతా ఆమె కనుసన్నల్లోనే..
పేదరికంలో మగ్గుతున్న ఈశాన్య రాష్ట్రాల మేఘాలయ, త్రివేండ్రం, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాలతోపాటు మసాజ్కు గుర్తింపు వున్న థాయ్లాండ్ తదితర ప్రాంతాల నుంచి యువతులకు ఉద్యోగ, ఉపాధి అవసరాలను గుర్తించి వారికి గాలం వేశారు. థాయ్లాండ్ నుంచి యువతులను ముంబై, బెంగళూరు, హైదరాబాద్ చేర్చేందుకు కాకే అనే మహిళా దళారిగా వ్యవహరించింది.
ముంబైలో ఉంటూ...
దళారి మహిళ ముంబైలో నివాసం ఉంటుంది. తనకున్న పరిచయాలతో థాయ్లాండ్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలను దేశంలోని పలు నగరాలకు సరఫరా చేస్తోంది. 3 నెలల ప్యాకేజీలపేరుతో నగరానికి వచ్చే ఈ యువతులకు భోజనం, వసతి, విలాసవంతమైన జీవితం గడిపే విధంగా నిర్వాహకులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో యువతులు నివాసం కల్పించారు.
అంతా ఆన్లైన్లోనే..
కస్టమర్స్ అపాయింట్మెంట్, బిల్లింగ్ అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. రూ.6000-9000 వరకూ ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్నట్లు తేలింది. అమ్మాయిలకు విటుల నుంచి వచ్చిన గ్రేడింగ్ ఆధారంగా వేతనం, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి తిరిగి అక్కడకు చేరేవరకూ అమ్మాయిలపై నిఘా ఉంటుంది.
ఇలా బెదిరిస్తారు...
బయటి వ్యక్తులతో ఎవరైనా మాట్లాడినట్లు తెలిస్తే ఆ రోజు వారికి భోజనం ఉండదు. పాస్పోర్ట్ తిరిగి ఇవ్వబోమని, నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్లాక్మెయిలింగ్కూ పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇలా బయటపడింది...
కూకట్పల్లికి చెందిన ఓ యువకుడి(24)ని అతడి తల్లిదండ్రులు ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకొచ్చారు. తమ కుమారుడు స్పాలకు అడిక్ట్ అయ్యాడని, ఇంట్లో నుంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోసారి రూ.3 లక్షలు తీసుకెళ్లి స్పాలకు పెట్టాడని చెపపారు. మళ్లీ రూ.2 లక్షలు దొంగతనం చేస్తుండగా పట్టుకొని తీసుకొచ్చినట్లు తెలిపారు. అతణ్ని విచారించిన పోలీసులు కొన్ని స్పా కేంద్రాల్లో బాడీ మసాజ్ పేరిట లగ్జరీ వ్యభిచారం జరుగుతోందని గుర్తించారు.