'కారు' ఎక్కుతూ టీఆర్ఎస్కు డీఎస్ ఝలక్! ప్రతిసారి మీకేనా: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతానని చెప్పిన డీ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరుస్తూ, టీఆర్ఎస్లో అంతకుముందు చేరిన నేతలకు ఝలక్ ఇచ్చారు. గురువారం నాడు డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు.. వాళ్లంతా స్వార్థం కోసం, స్వలాభం కోసం చేరుతున్నారని విమర్శించారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనిపై డీఎస్ ఆసక్తికర సమాధానం చెప్పారు. వారంతా స్వార్థం కోసమే పార్టీ మారారని, తాను మాత్రం ఏ పదవినీ ఆశించకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తనను ఇరికించేందుకే మీడియా ఇలాంటి ప్రశ్నలు వేస్తోందని డీఎస్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
పదవులు అనుభవించి పార్టీని వీడటం సరికాదు: ఉత్తమ్
డీఎస్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరుగా అన్నారు. గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్కు కాంగ్రెస్ పార్టీ 35 ఏళ్లపాటు వివిధ పదవులు కట్టబెట్టిందన్నారు.
అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని పార్టీని వీడటం సరికాదన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బీసీ మహిళ అయిన ఆకుల లలితకు అధిష్ఠానం ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చిందన్నారు. ప్రతిసారీ పాతవారికే పదవులు ఇస్తే పార్టీలో కొత్తవారి పరిస్థితి ఏమిటన్నారు. రాజకీయాల్లో మహిళలు సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు.