డీఎస్ వంటి వారితో టీఆర్ఎస్ పడవ బరువెక్కుతోంది: నారాయణ, రాజ్యసభపై కెసిఆర్ హామీ?
న్యూఢిల్లీ: డి శ్రీనివాస్ లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి పవిత్రత దెబ్బతింటుందని, బరువు ఎక్కువై ఆ పార్టీ పడవ మునగడం ఖాయమని సీపీఐ నేత నారాయణ శనివారం నాడు ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలనను, ప్రజా సమస్యలను పక్కన పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసి పని చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పడం శుభపరిణామమన్నారు.
అవినీతి కేసులో అరెస్టై జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు స్వతంత్ర సమరయోధుల్లా ఊరేగింపులు చేయడం సరికాదన్నారు. అవినీతికి పాల్పడిన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థానం సీఎం వసుంధర రాజేలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
సోనియాను తప్పుదోవ పట్టించారు: డీఎస్
సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించారని మాజీ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ శనివారం మండిపడ్డారు. గాంధీ భవన్లో తన ఫోటోను తొలగించడంపై స్పందిస్తూ... ఫోటో తొలగించినంత మాత్రాన చరిత్ర మాసిపోదన్నారు. తన ఇంట్లో ఎప్పటికీ సోనియా ఫోటో ఉంటుందన్నారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, ఉద్యమం నడిపింది కెసిఆర్ అన్నారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడం తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా, డీఎస్ ఈ నెల 8న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చేందుకు కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2016 మార్చిలో రాజ్యసభకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.