మా కార్యకర్తల జోలికొస్తే బట్టలూడదీస్తా: దామోదర
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి, పోలీసులను మాజీ డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్రంగా హెచ్చరించారు. టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బట్టలూడదీస్తానని రాజనర్సింహ హెచ్చరించారు.
శుక్రవారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూతురి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయనతో మాట్లాడుతూ, పోలీసులు తమపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడమేగాకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన దామోదర పై వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నుంచి సీపీఎం మహాసభలు
హైదరాబాద్: సిపిఎం తెలంగాణ తొలిమహాసభల షెడ్యూల్ను ప్రకటించారు. మార్చి 1 నుంచి 4 వరకు ఈ సభలు జరుగుతాయి. ఆదివారం ఉదయం 10.30కి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రారంభిస్తారు. అంతకు ముందు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
నిజాం కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు 'తెలంగాణ జనజాతర' కార్యక్రమాన్ని ఆర్థికమంత్రి ఈటెల ప్రారంభిస్తారు. సాయంత్రం కల్చరల్ ఎగ్జిబిషన్ను దర్శకులు దాసరి నారాయణరావు ప్రారంభించనున్నారు. మార్చి1-4 తేదీల మధ్య ప్రతినిధుల సభ, ఆయా అంశాలపై తీర్మానాలు, నివేదికలపై చర్చ ఉంటుంది.
మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రసేన కవాతు ఎస్వీకే నుంచి నిజాం కాలేజీ వరకు, మరొక ప్రదర్శన, ఇందిరా పార్కు నుంచి నిజాం కాలేజీ వరకు తెలంగాణ కళారూపాల ప్రదర్శన, ఇంకొకప్రదర్శన చార్మినార్ నుంచి నిజాం కాలేజీ వరకు ఉంటాయి. సాయంత్రం బహిరంగసభ నిర్వహిస్తారు.