కెసిఆర్! కిరణ్కు ఏ గతి పట్టిందో చూశావ్: దానం 'గ్రేటర్' సవాల్, పార్టీలోనే కుట్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ ఆదివారం నాడు హెచ్చరించారు.
తాను టీఆర్ఎస్లో చేరుతానని వస్తున్న వార్తల పైన దానం ఘాటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలన పైన ధ్వజమెత్తారు.
ఒంటెత్తు పోకడలకు వెళ్తే కిరణ్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూశామన్నారు. త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టో అరచేతిలో స్వర్గం చూపించిందన్నారు. ఆపరేషన్ ఆకర్ష్తో ప్రతిపక్షాలను బలహీనపరుస్తోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రులు ఆలోచించుకొని తమ ఓటుతో సరై నిర్ణయం ఇవ్వాలన్నారు. గ్రేటర్ ఎన్నికల పైన తాము టీఆర్ఎస్ను సవాల్ చేస్తున్నామని చెప్పారు.
ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ ప్రతిపక్షాలను బలహీనపర్చే కుట్ర చేస్తోందన్నారు. ఎంతసేపు ఏ రాజకీయ నాయకుడిని లాక్కుందామనే తప్ప మరేం ఆలోచన లేదన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పైన దృష్టి సారించాలని దానం సూచించారు.
ఓయూ వల్లనే ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పిన కెసిఆర్.. ఇప్పుడు విద్యుర్థుల గొంతు పట్టుకున్నారని మండిపడ్డారు. అధికారం ఉందని మనం విచ్చలవిడిగా ఉండటం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలన్నారు.
కెసిఆర్ కరీంనగర్ జిల్లాలో కోతుల కథ చెప్పారని, కానీ తెలంగాణలోను కోతులు వచ్చాయని తెరాస అధికారాన్ని ఉద్దేశించి అన్నారు. మీరు కోతులు కాదనే ప్రజలు అధికారం కట్టబెట్టారని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మంచిది కాదన్నారు.
తన పైన పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదన్నారు. అయితే తనకు పొగ పెట్టి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనను బయటకు పంపించే కుట్ర జరుగుతుండవచ్చన్నారు.