కేంద్రానికి, తెలంగాణకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఓర్వలేకనే..: దత్తాత్రేయ
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 10వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని టిఆర్ఎస్ కవిత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
వాస్తవానికి కేంద్రానికి రాష్ట్రం నుంచి సకాలంలో ప్రతిపాదనలు రాలేదని తెలిపారు. పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే అధికంగా ఇచ్చామని దత్తాత్రేయ తెలిపారు.
రామగుండం, మహబూబ్నగర్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, ఆదిలాబాద్ పట్టణాల అభివృద్ధికి 405 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం 415 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.
హైదరాబాద్కు 20 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడితే తాము సహకరిస్తామని ఆయన తెలిపారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం కాదు, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు.
తెలంగాణలో కరవు తీవ్రంగా ఉందని, రెండు జిల్లాల్లో పూర్తిగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్కసుతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆయన తెలిపారు.