సుష్మతో మాట్లాడా: లిబియా కిడ్నాప్పై దత్తాత్రేయ, క్షేమంగా: కంభంపాటి
హైదరాబాద్/న్యూఢిల్లీ: లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం చెప్పారు.
ఆయన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఉస్మానియా రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాలి కల్పించాలన్నారు.
ఉగ్రవాదుల చెరలో బందీలైన తెలుగు వారు క్షేమంగానే ఉన్నారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా అన్నారు. లిబియాలో భారత రాయబారి రషీద్తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.
అక్కడి విశ్వవిద్యాలయం డీన్తో బందీలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్తోనూ మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
గత బుధవారం లిబియాలోని ట్రిపోలీ సమీపంలో విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న నలుగురు భారతీయులను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అందులో ఇద్దరు కర్నాటక వాసులను విడుదల చేశారు. తెలుగువారిని విడుదల చేయవలసి ఉంది.