బెయిల్ ఆర్డర్లో సందిగ్ధత: రేవంత్ రెడ్డి విడుదలలో మరింత జాప్యం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. బెయిల్ ఆర్డర్లో సందిగ్ధత కారణంగా రేవంత్ విడుదలలో జాప్యం అవుతుందని సమాచారం. మొత్తంమీద కొంత ఆలస్యంగానైనా చర్లపల్లి జైలు నుంచి రేవంత్రెడ్డి విడుదల కానున్నారు.
బెయిల్ ఆర్డర్ కాపీ రీమాడిఫై కోసం రేవంత్ న్యాయవాదులు ఫర్బీయింగ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కొత్త ఆర్డర్ జారీ చేసింది. ష్యూరిటీలు, డిపాజిట్లు, బెయిల్ ఆర్డర్లను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో రేవంత్ తరపు లాయర్లు కోరారు. దీంతో రేవంత్రెడ్డి బెయిల్ ఆర్డర్లో సాంకేతిక పొరపాటును హైకోర్టు సరిదిద్ది కొత్త ఆర్డర్ను విడుదల చేసింది.
అంతక ముందు బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలున్నాయని, న్యాయమూర్తి తీర్పులో రూ. 5 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తును పోలీసు స్టేషన్లో దాఖలు చేయాలని చెప్పడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం. మరోసారి న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు.
న్యాయమూర్తి తీర్పు ప్రతిలో మార్పులు చేస్తే బుధవారం రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో రేవంత్ రెడ్డి విడుదలలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాగా, బెయిల్ మంజూరు కావడంతో రేవంత్ రెడ్డి మంగళవారంనాడు సాయంత్రమే జైలు నుంచి విడుదలవుతారని భావించారు.
కాగా, నెలరోజుల పాటు జైలులో గడపిన రేవంత్రెడ్డి బుధవారం విడుదల కానున్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చర్లపల్లి జైలు వద్దకు తరలివచ్చారు. మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నగరం నుంచి టీడీపీ కార్యకర్తలు రేవంత్రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు తరలివచ్చారు.