షాకిచ్చారు: కేసీఆర్ చెప్పారు, హైదరాబాద్లో కూల్చేస్తున్నారు
హైదరాబాద్: భాగ్యనగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలతో పాటు, చెరువులను, నాలాలను ఆక్రమించుకొని ఇళ్లు, అపార్టుమెంట్లు నిర్మించిన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయాచోట్ల పడవల్లో వెళ్లి ఆహారపదార్థాలు సరఫరా చేశారు.
వర్షాల దెబ్బతో.. ఆక్రమణల పైన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. ఆక్రమణలకు గురైన నాలాలపై నిర్మాణాలు కూల్చివేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన నాలాలను సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేస్తున్నారు. శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు.
అలాగే ఉప్పల్ పరిధిలోని స్వరూప్నగర్ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చి వేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్నగర్, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ముంపునకు గురయ్యాయి.
అలాగే, రామంతాపూర్, చిలుకానగర్, హబ్సిగూడలోని నాలాలపై నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు పట్టణ ప్రణాళిక అధికారి నాగిరెడ్డి తెలిపారు.
ఇన్ఫ్లోకు అనుగుణంగా ఔట్ఫ్లో పెంచాలి: కేసీఆర్
వర్షాలు, వరదల పరిస్థితిపై కరీంనగర్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి ఆర్మీనా, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్, బాల్కా సుమన్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, ఈ అనుభవాలను భవిష్యత్లో అనర్థాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మిడ్ మానేరు డ్యాంకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతోనే చాలా అనర్థం జరిగిందన్నారు. దశాబ్ద కాలంగా పనులు జాప్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు.
మిడ్మానేరు ఆనకట్ట 130 మీటర్లు దెబ్బ తిన్నదని, ఇక పైనుంచి వరద వచ్చినా పెద్దగా నష్టం లేదని అధికారులు చెప్పారు. ఇకపై ప్రమాదం ఉండదు కాబట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామస్తులను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు.
వర్కింగ్ ఏజెన్సీలు తమకు అప్పగించిన పనులు సకాలంలో జరిగేటట్లు అవసరమైన నిబంధనలు రూపొందించాలన్నారు. అయిదు శాతం మించి లెస్కు పోకుండా చాడాలని, లెస్ టెండర్లు వేసినప్పుడు అంతమొత్తం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలన్నారు.