ఒత్తిళ్లు నో: హైదరాబాద్లో తెరాస నేత, ఎమ్మెల్యే ముందే కూల్చివేత
హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ కట్టడాల పైన తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. నాలాల ఆక్రమణల పైన జిహెచ్ఎంసి కన్నెర్ర చేసింది. అక్రమ నిర్మాణాలను సోమవారం కూల్చివేసిన జిహెచ్ఎంసి.. వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా కూల్చివేస్తోంది.
ఇప్పటికే అక్రమ కట్టడాల కూల్చివేత పైన ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించిన విషయం తెలిసిందే. నాలాలు, చెరువుల పైన ఉన్న అక్రమ కట్టడాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు అందాయి.
నగరంలోని అన్ని అన్ని ప్రాంతాల్లో భవనాల కూల్చివేత కొనసాగుతోంది. కూల్చివేతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు మరో ఎనభై నిర్మాణాలు కూల్చివేస్తామని జిహెచ్ఎంసి అధికారులకు చెప్పారు. 93 దాకా కూల్చేసినట్లు చెప్పారు.
మరిన్ని రోజులు కూల్చివేతలు
గచ్చిబౌలిలో పలు అక్రమకట్టడాలను అధికారులు కూల్చి వేశారు. స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాలానగర్లోని నాలాలపై నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగించారు. ప్రధాన నాలాపై భవనాలు నిర్మించడంతో మురుగు నీరు కాలనీల్లోకి వస్తోంది. దీంతో అక్రమకట్టడాలను కూల్చివేశారు. అటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనూ కూల్చివేశారు.
బంజారా లేక్
ఇటీవల కురిసిన వర్షాలకు అల్లంతోట బావి బస్తీ సముద్రాన్ని తలపించింది. ఇక్కడ నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. అల్లంతోట బావిలో నాలాలపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. బంజారా లేక్ చుట్టూ కబ్జాకు గురైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. చుట్టూ భూమి అంతా కబ్జాకు గురికావడంతో లేక్ కుచించుకుపోయింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరంతా రోడ్ల పైకి వచ్చింది. కర్మన్ ఘాట్ సుభాష్ నగర్లో నాలాల ఆక్రమణలపై తొలగిస్తున్నారు. స్థానికులు అభ్యంతరం చెప్పినా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు.
రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎనిమిది అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు గుర్తించి, కూల్చి వేశారు. ఇక్కడ కూడా వర్షాలకు పలు ఇళ్లు నీట మునిగాయి. అరంఘార్ చౌరస్తా, దుర్గానగర్, అత్తాపూర్, శివరాంపల్లిలోని అక్రమ కట్టడాలను కూల్చేశారు. పోలీసు భద్రత మధ్య అధికారులు భవనాలను కూల్చి వేశారు. మియాపూర్లోను కూల్చివేతలు జరిగాయి.
ఎమ్మెల్యే సమక్షంలోనే కూల్చివేత
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోనూ పలుచోట్ల అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మారుతీ నగర్, గాజుల రామారాంలో నాలాలు కబ్జా చేసి నిర్మించిన భవనాలను కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మున్సిపల్, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అక్రమ భవనాలను కూల్చివేశారు