కేసీఆర్ సర్కారుకు మరో మచ్చ: ధర్నాచౌక్లో పోలీసులే స్థానికులు, శ్రీదేవి సస్పెన్షన్
హైదరాబాద్: సోమవారం ధర్నాచౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ధర్నా చౌక్ ఇక్కడ వద్దంటూ నిరసనలు తెలుపుతూ ప్లకార్డులు పట్టుకున్న సుమారు 20మంది కానిస్టేబుళ్లు సాధారణ దుస్తులతో వచ్చి కూర్చోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో లేక్ వ్యూ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి కూడా ప్లకార్డులను పట్టుకుని దర్శనమిచ్చారు.
శ్రీదేవి సస్పెన్షన్ వేటు
ఈ నేపథ్యంలో శ్రీదేవిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెను విధుల నుంచి తప్పించి కంట్రోల్ రూమ్కు అటాచ్ చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. పోలీసులు ధర్నా చౌక్ వద్ద స్థానికులు, వాకర్లుగా చెప్పుకుంటూ నిరసనలు చేయడం వెనుక టీఆర్ఎస్ ఉందని విపక్షాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
నిరసనలో పాల్గొన్నవారిపై విచారణ
శ్రీదేవి వ్యవహారంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీసీపీ వెల్లడించారు. ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుళ్లను కూడా వివరణ కోరినట్లు డీసీపీ చెప్పారు. సీఐ శ్రీదేవితోపాటు మరో 20మంది మహిళా కానిస్టేబుళ్లు నిరసనలో పాల్గొన్న తెలిసిందే.
నిరసన తెలిపి మళ్లీ యూనిఫాంలో..
కాగా, సోమవారం ఉదయం ప్లకార్డులతో ధర్నా చేసిన మహిళా కానిస్టేబుళ్లు.. మీడియాలో వార్తలు రావడంతో వెళ్లిపోయి, మళ్లీ యూనిఫాంలో వచ్చి విధులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ సర్కారుకు మరో మచ్చ
ఇటీవల ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసానికి పాల్పడ్డారంటూ రైతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. సోమవారం ధర్నా చౌక్లో నిర్వహించిన నిరసనల్లో పాల్గొని కేసీఆర్ సర్కారుకు మరో మచ్చ తెచ్చినట్లయింది. రైతులకు బేడీలు వేయడంపై టీఆర్ఎస్ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసులనే వాకర్లుగా, స్థానికులుగా చూపిస్తూ నిరసనలు చేయపట్టడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేసీఆర్ సర్కారు ప్రజా నిరసనలకు తావివ్వకుండా అరాచకాలకు పాల్పడుతోందంటూ విరుచుకుపడ్డారు.