'కెసిఆర్ బంధువుల భూమి కబ్జా', 'ఎకరాకు రూ.కోటి భ్రమలో సిఎం'
మహబూబ్ నగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గంలో దళితుల, ప్రభుత్వ భూమిని కెసిఆర్ బంధువులు లక్ష్మీకాంత రావు, నర్సింగ రావు, విజయ్ కుమార్, వేదకుమార్లు 145 ఎకరాలు కబ్జాచేశారని ఆరోపించారు.
బినామీ పేర్లతో మొత్తం దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు కబ్జాకు గురైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా మారిందన్నారు.
గ్రామజ్యోతి ఎలా వెలిగిస్తారు: కిషన్ రెడ్డి
నిధులు కేటాయించకుండా గ్రామజ్యోతిని ఎలా వెలిగిస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చీప్ లిక్కర్ అమ్మకాలపై గ్రామజ్యోతి సభల్లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం సిద్దమేనా అని ప్రశ్నించారు. చీప్ లిక్కర్తో గీత కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు.
కెసిఆర్ తన ఫాం హౌస్లో ఎకరానికి రూ.కోటి సంపాదిస్తూ రాష్ట్రంలో రైతాంగం అంతా తనలానే ఉన్నారనే భ్రమలో బతుకుతున్నారన్నారు. రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
గ్రామాల బాగు కోసమే: వినోద్ కుమార్
గ్రామాల బాగుకే గ్రామజ్యోతి కార్యక్రమం అని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్రం గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నీతి అయోగ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి ఆదాయం తగ్గిందన్నారు.
కెసిఆర్ గ్రామజ్యోతిపై విపక్షాల మాటల దాడి
కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం పైన విపక్షాలు మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే. మన ఊరు - మన ప్రణాళిక ఏమయిందని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో చీప్ లిక్కర్ ప్రవహిస్తే గ్రామజ్యోతి ఎలా వెలుగుతుందని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం అన్నారు. గ్రామ జ్యోతి సభల్లో మంత్రులను, అధికారులను ఈ విషయంపై నిలదీయాలన్నారు. గుడుంబా అరికడతామన్న వంకతో చీప్ లిక్కర్ను ప్రోత్సహించడం భావ్యం కాదన్నారు.
గ్రామజ్యోతి సభకు నిధులు లేవన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చెప్పేదొకటి, చేసేదొకటి అని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జరిగిన అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నారని, ఆ నివేదిక ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కెజి టు పిజి నిర్భంధ విద్య ఏమైందని, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్షల కొద్దీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, ఇప్పుడు లక్ష కాదు కదా కేవలం 15వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ నిలిపి వేశారని, కళాశాల విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ నిలిపి వేశారన్నారు. చేవేళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుకు మార్పు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కెటిఆర్ గ్రామజ్యోతి పేరిట కొత్త నాటకానికి తెర తీశారని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. పల్లెల్లో రైతుల జ్యోతులు ఆరిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు.
కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త నినాదాలు, కొత్త పథకాలతో ముందుకు వెళ్తూ ప్రజలను మభ్యపెడుతూ పనులు మాత్రం చేపట్టకుండా పబ్బం గడుపుతున్నాడని మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
కెసిఆర్ 14 నెలల పరిపాలనలో అన్నీ వైఫల్యాలేనని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవాలలో కనీసం 14 నిమిషాలకు మించి మాట్లాడలేదని, ఇదే ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనమని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.