'కేసీఆర్కు సీఎంగా కొనసాగే అర్హత లేదు', 'కేసీఆర్ చిరకాల కోరిక నెరవేరబోతోంది'
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్పై విపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ రైతు సమస్యలపై కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. రైతాంగాన్ని కాపాడుకోలేని కేసీఆర్కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు.
బంగారు తెలంగాణ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు.
కేసీఆర్ చిరకాల కోరిక నెరవేరబోతోంది: మంత్రి పోచారం
పేదల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాల కోరిక నెరవేరబోతోందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని బోయిగూడలో ఐడీహెచ్ కాలనీని తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ పేదలకు రెండు పడక గదుల ఇల్లు కట్టించి ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 60వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కేసీఆర్ ఎంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రెండు పడక గదుల ఇళ్లకు విజయదశమి రోజున భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4,500 కోట్లు ఖర్చుపెట్టనుందన్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తున్న 396 ఇళ్లను గురువారం పరిశీలించారు.