డ్రగ్స్ కేసు: మత్తును చిత్తు చేసే ఎత్తులు, ఆ తరువాతే విచారణకు, తెలివైన వారే...
డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పలువురు తమ దేహంలో డ్రగ్స్ అవశేషాలను తుడిచిపెట్టేసే పనిలో పడ్డారు.
హైదరాబాద్: అపాయంలో పడినప్పుడే బుర్ర చురుగ్గా పనిచేస్తుందట. శతకోటి ఉపాయాలు అందిస్తుందట. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కంటున్న సినీ ప్రముఖులకు కూడా బుర్ర బాగానే పనిచేస్తోంది.
డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పలువురు తమ దేహంలో డ్రగ్స్ అవశేషాలను తుడిచిపెట్టేసే పనిలో పడ్డారు. దీనికోసం అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులు వారు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ అవశేషాలు దొరక్కుండా...
సినీ ప్రముఖుల్లో కొందరు అలోవెరా జ్యూస్(కలబంద రసం) తాగి విచారణకు హాజరవుతున్నారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కోబోతున్న మరికొందరు ‘డీటాక్సిఫికేషన్' థెరపీని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు మొత్తం బయటికి వెళ్లిపోతాయని.. దీంతో రక్త నమూనాలు సేకరించినా వారి దేహంలో డ్రగ్స్ అవశేషాలు దొరకవనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
కొందరు ‘ఎస్'.. మరి కొందరు ‘నో'
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను సిట్ ఈనెల 19 నుంచి విచారిస్తోంది. విచారణలో భాగంగా వీరి దేహాల్లో డ్రగ్స్ అవశేషాలను తెలుసుకునేందుకు సిట్ అధికారులు వైద్య నిపుణుల ద్వారా వారి రక్తం, వెంట్రుకలు, గోళ్లను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా లను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం సిట్ విచారణకు హీరోయిన్ ఛార్మీ కూడా హాజరైంది. హీరో నవదీప్ మాత్రం ఇందుకు నిరాకరించడంతో అతడి నుంచి రక్త నమూనాలు సేకరించనట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోయిన్ ఛార్మీ కూడా ఇందుకు నిరాకరిస్తోంది.
ఏమిటీ డీటాక్సిఫికేషన్...?
డీటాక్సిఫికేషన్ అంటే... శరీరంలోని మలినాలు, ఇతర విష పదార్థాలను బయటికి పంపే ప్రక్రియ. కొన్ని జీవక్రియల ద్వారా మలినాలు, విష పదార్థాలు వాటంతట అవే శరీరంలోంచి తొలగిపోతాయి. అవసరమనుకుంటే కృత్రిమ ప్రక్రియల ద్వారా కూడా తొలగించవచ్చు. ఫుడ్పాయిజన్ సందర్భాల్లో డాక్టర్లు విష పదార్థాలను తొలగించడం ఈ కోవకు చెందినదే. నోటిద్వారా తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవుతుంది. వ్యర్థాలన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అయితే మత్తు పదార్థాలు తీసుకున్న వారిలో కొన్ని టాక్సిన్లు, డ్రగ్స్ అవశేషాలు చాలారోజులపాటు వారి శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని కొన్ని ప్రక్రియల ద్వారా బయటికి పంపించడాన్నే డీటాక్సిఫికేషన్ గా వ్యవహరిస్తున్నారు.
పలు రకాల పద్ధతులు...
ఈ డీటాక్సిఫికేషన్ కు చాలా రకాల పద్ధతులున్నాయి. వాటిలో ‘స్టీమ్ బాత్' ఒకటి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువ మోతాదులో బయటకు వస్తుంది. శరీరంలో ఏమైనా టాక్సిన్లు ఉంటే ఈ చెమట ద్వారా వెళ్లిపోతాయి. ఎఫ్ఐఆర్(ఫార్ ఇన్ఫ్రారెడ్) ప్రక్రియలోనూ కార్బన్ హీటర్స్తో శరీర ఉష్ణోగ్రత పెంచుతారు. ఈ పద్ధతిలో కూడా చెమట రూపంలో విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కొన్ని సందర్భాల్లో ‘హైపోథెరపీ' చేస్తుంటారు. అంటే.. ‘కొలోన్'(మల మార్గం) ద్వారా ట్యూబ్ను పంపించి కడుపు, పేగుల్లోని మలినాలను తొలగించి శుభ్రం చేయడం.
చిలేషన్, అలోవెరా జ్యూస్ కూడా...
రక్త నమూనాల్లో డ్రగ్స్ అనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు విచారణకు హాజరవుతున్న వారు ‘చిలేషన్' అనే ఒక ప్రక్రియను కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో సెలైన్ బాటిళ్ల ద్వారా రసాయనాన్ని శరీరంలోకి ఎక్కిస్తారని, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని అంటున్నారు. అలాగే కలబంద రసం తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలోవెరా జ్యూస్ (కలబంద రసం) తాగడం వల్ల 90 శాతం మేర కడుపు శుభ్రం అవుతుందట. పైగా మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో అలోవీరా జ్యూస్ దొరుకుతోంది. దీనికి సహజంగా ఉండే చేదు గుణం పోవడానికి స్ట్రాబెరీ,, యాపిల్ వంటి ఫ్లేవర్లను కలుపుతుండడంతో తాగేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
శుభ్రం చేసుకున్నాకే విచారణకు...
డ్రగ్స్ కేసులో అనుమానితులుగా విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులు పలువురు ఇలాంటి జ్యూస్లను తాగి తమ కడుపు, దేహం శుభ్రం చేసుకున్న తరువాతే విచారణకు హాజరవుతున్నట్లు సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ అధికారులే చెబుతున్నారు. ఫలితంగా వారి నుంచి సేకరిస్తున్న రక్త నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉండకపోవచ్చని కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి బాహుబలి 3 మన అకున్ సబర్వాలే ఘటికుడనుకుంటే.. ఆయన్ని మించిపోయి ఉన్నారు సినీ ప్రముఖులు.