ఐఎఎస్ అధికారి భార్య కారు డ్రైవర్ హత్య: ఆమె కుమారుడి పనే, అరెస్టు
ఓ ఐఎఎస్ అధికారి భార్య వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఐఎఎస్ అధికారి కుమారుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: ఓ ఐఏఎస్ అధికారి భార్య వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఐఏఎస్ అధికారి కుమారుడే డ్రైవర్ని చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారించుకున్నారు.
ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కొడుకు సుక్రుత్ తమ ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 17న డ్రైవర్ నాగరాజును హతమార్చి 3 రోజులుగా శవాన్ని దాచిపెట్టినట్లు తేలింది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు ఐఏఎస్ అధికారి కొడుకు సుక్రుత్ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదులోని యూసుఫ్గూడ సాయి కల్యాణి రెసిడెన్సీ టెర్రస్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్వాసులు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లి పరిశీలించగా అక్కడ ఓ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అపార్ట్మెంట్ వెలుపల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. రెండు రోజుల నుంచి అపార్ట్మెంట్కు ఎవరెవరు వచ్చారనే వివరాలను సేకరించారు.
ఈ నెల 17న ఇద్దరు యువకులు లోపలికి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత ఒకరు మాత్రమే బయటకు వచ్చినట్టు సిసి కెమెరాలో రికార్డు అయింది. సీసీ పుటేజీ ఆధారంగా ఆ మృతదేహం జవహర్నగర్కు చెందిన నాగారాజుదిగా అనుమానించారు. అతని భార్యను తీసుకువచ్చి చూపించగా తన భర్తేనని ఆమె గుర్తు పట్టింది.
నాగరాజు ఓ ఐఏఎస్ అధికారి భార్య వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడని ఆమె చెప్పింది. సీసీ టీవీ పుటేజీ రికార్డును పోలీసులు అపార్ట్మెంట్వాసులకు చూపించారు. శనివారం అతడు వచ్చాడని, కారిడార్ వద్ద తచ్చాడుతున్న అతడిని తాము ప్రశ్నించేలోగా పారిపోయాడని వారు చెప్పారు.