తెలంగాణలో 231 కరువు మండలాలు: కేంద్రం సాయం కోరిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో 231 మండలాల్లో కరువు తలెత్తినట్టు తెలంగాణ ప్రభుత్వం నిర్దారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కరువు మండలాలలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాపాతం బాగానే ఉందని సమావేశంలో నిర్దారించారు. మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షికంగా కరువు ఉన్నట్టు ఒక నిర్దారణకు వచ్చారు.
మొత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 231 మండలాల్లో కరువు నెలకొన్నందున కేంద్రం తక్షణమే రాష్ర్టానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపిన నివేదికలో విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కరువు మండలాల పరిశీలనకు కేంద్రం వెంటనే రాష్ర్టానికి ఒక బృందాన్ని పంపించాలని కోరారు.
ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు హాజరయ్యారు.