డ్రగ్స్ కేసు: సబర్వాల్ కు బెదిరింపులు, రంగంలోకి టీ డీజీపీ, ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్కి అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చిన విషయంపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ రంగంలోకి దిగారు. మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఏపీ డీజీపీ సాంబశి
హైదరాబాద్: హైదరాబాద్లో అలజడి రేపుతున్న డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతూ దూసుకుపోతున్న ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
'వర్మ అరెస్ట్ ఖాయం! అకున్ సబర్వాల్పై కించపరిచే వ్యాఖ్యలా?'
ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తాజాగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఆ కాల్స్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని, కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు.
అవసరమైతే అకున్ సబర్వాల్కు భద్రత పెంచుతామని తెలిపారు. అకున్ సబర్వాల్ కు బెదిరింపు కాల్స్ పై విచారణ ముమ్మరం చేశామని అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలే ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.
''చేనును కంచె మేసినట్లుగా ఉంది..''
మరోవైపు తెలంగాణలో, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పందించి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
డ్రగ్స్ వ్యవహారం చేనును కంచె మేసినట్లుగా ఉందని, ఇందులో తెలంగాణ పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగిపోయి పలువురు పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వ్యవహారం పరిధిని దాటి వెళుతోందని పేర్కొన్నారు.
డ్రగ్స్ వ్యవహారంలో గతంలోనూ విచారణలు జరిగాయని, ఏపీలో డ్రగ్స్ కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేశారని సాంబశివరావు అన్నారు. తాము ఎక్సైజ్ శాఖతో కలిసి డ్రగ్స్ నివారణకు ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.