డ్రగ్స్ కేసు: సోమవారం హీరో నవదీప్, 26న హీరోయిన్ ఛార్మీ, ఆ తరువాత వరుసగా..
డ్రగ్స్ కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈనెల 26న హీరోయిన్ ఛార్మీ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు తెలిపారు. ఛార్మీని సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈనెల 26న హీరోయిన్ ఛార్మీ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు తెలిపారు. ఛార్మీని సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారు.
ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన సిట్ అధికారులు మిగతా వారిని విచారించేందుకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం నుంచి నటుడు తరుణ్ని ప్రశ్నిస్తున్న అధికారులు.. సోమవారం నవదీప్ను విచారించనున్నారు.
మంగళవారం రవితేజ, బుధవారం ఛార్మీ, గురువారం ముమైత్ ఖాన్ లు విచారణకు హాజరవుతారని చెప్పారు.
తరుణ్ రక్తం, గోళ్లు, వెంట్రుకలను సేకరించిన వైద్యులు..
డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న నటుడు తరుణ్ విచారణకు ఇవాళ సిట్ ముందు హాజరయిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి తరుణ్ ను విచారిస్తున్న సిట్ అధికారులు కెల్విన్ తో తరుణ్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ కొనసాగుతుండగానే.. ఉస్మానియా వైద్యులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని తరుణ్ రక్త నమూనా, చేతి గోళ్లు, వెంట్రుకలను సేకరించారు. క్లూస్ టీమ్ తరుణ్ ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది.
16 ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు, 3 ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా...
డ్రగ్స్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో 16 ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు సిట్ గుర్తించింది. డ్రగ్స్ విక్రయాల్లో 3 ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నట్లుగా తాము గుర్తించామని సిట్ అధికారులు వెల్లడించారు.
అయితే ఈ మూడు హోటళ్ల యజమానులను సోమవారం విచారణకు హాజరు కావాలని సిట్ కోరనున్నట్లు సమాచారం. ఈ హోటళ్ల యజమానులకు డ్రగ్స్పై హెచ్చరికలు జారీ చేయనుంది సిట్.