డ్రగ్స్ కేసు: 12 మంది సినీ ప్రముఖులు, అరెస్టు అంశంపై ఇప్పుడే చెప్పలేం: అకున్ సబర్వాల్
తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడిన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మరిన్ని వివరాలు తెలిపారు.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడిన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మరిన్ని వివరాలు తెలిపారు.
ఇప్పటివరకు ఎవరి పేర్లనూ తాము అధికారికంగా వెల్లడించలేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. మొత్తం 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపాలని అనుకున్నామని, కానీ12 మందికి మాత్రమే నోటీసులు వెళ్లాయని చెప్పారు.
మరో ఇద్దరికి నోటీసులు?
అడ్రస్ సరిగా లేకపోవడం వలన మరో ఇద్దరికి నోటీసులు అందే విషయంలో ఆలస్యం జరిగిందని చెప్పారు. మొదట ఆ 12 మందిని విచారించనున్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసే అంశంపై ఇప్పుడేం చెప్పలేమని పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో వేగంగా విచారణ కొనసాగిస్తున్నామని, తమపై ఎవరి ఒత్తిడి లేదని సబర్వాల్ చెప్పారు. తాను ఎల్లుండి నుంచి సెలవుపై వెళుతున్నానని, జూన్లోనే తాను సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నానని, నార్త్ ఇండియా వెళుతున్నానని చెప్పారు.
ఎక్కడున్నా కేసును చూస్తూనే ఉంటా...
తాను సెలవుపై వెళ్లినా ఈ కేసులో ఏ నష్టం ఉండదని, తన టీమ్లో ఎంతో మంది సమర్థులైన అధికారులు ఉన్నారని, తానెక్కడ ఉన్నా ఈ కేసును పరిశీలిస్తూనే ఉంటానని తెలిపారు. గవర్నమెంట్ ఇప్పటికే తనకు సెలవు మంజూరు చేసేసిందని చెప్పారు.
పలువురు ఈ డ్రగ్స్ను ఆన్లైన్లో ఆర్డర్లు చేసుకుంటున్నారని, కొన్ని వెబ్సైట్లను గుర్తించామని అన్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఎల్ఎస్డీ యూనిట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇప్పటిదాక 13 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అదుపులోకి తీసుకుంటామని అకున్ సబర్వాల్ తెలిపారు.
విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్న అంశంపై అకున్ సబర్వాల్ స్పందిస్తూ.. విద్యాసంస్థలకు వెళ్లి తాము కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కేసు విచారణలో తమకు ప్రభుత్వ మద్దతు నూటికి నూరు శాతం ఉందని చెప్పారు.