హైదరాబాద్లో డ్రగ్స్ దందా: టెక్కీల ప్రపంచం విలవిల
దకద్రవ్యాల వ్యాపారం ఐటి రంగాన్ని కుదిపేస్తోంది. ఐటి కంపెనీల్లో పని చేసే కొంత మంది పని ఒత్తిడి, మానసికంగా అలసిపోవడంతో ప్రశాంతత కోసం మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నట్లు ఒకటి రెండు కంపెనీలు గుర్తించాయి.
హైదరాబాద్: హైదరాబాదులో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టెక్కీల ప్రపంచంం విలవిలలాడుతోంది. మాదకద్రవ్యాల వ్యాపారం ఐటి రంగాన్ని కుదిపేస్తోంది. ఐటి కంపెనీల్లో పని చేసే కొంత మంది పని ఒత్తిడి, మానసికంగా అలసిపోవడంతో ప్రశాంతత కోసం మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నట్లు ఒకటి రెండు కంపెనీలు గుర్తించాయి.
వారం చివరలో జరిగే విందులూ వినోదాల్లో పాల్గొని మద్యం సేవించడం, పబ్బుల్లో చిందేయడం హైదరాబాద్ మెట్రోపాలిటన్ కల్చర్లో చాలా కాలంగా సాగుతోంది. పబ్బుల్లో కొంత మంది డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఐటి కంపెనీల్లో పని చేసే ఉద్యోగులపై నిఘా ఉంచి వారి రక్త, మూత్రం నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోనూ, శివారుల్లోనూ చిన్నచితకా, బహుళజాతి ఐటి, ఐటి ఆధారిత సాంకేతిక సేవల కంపెనీలు సుమారు 1183 ఉన్నట్లు తాజా అంచనా. వీటిలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు చెందినవారు.
సైబరాబాద్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని కంపెనీల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు చెందిన ఐటి నిపుణులు, ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో వారి కోసమే అన్నట్లుగా పబ్బులు, క్లబ్బులు, స్టార్ రేంజ్ సౌకర్యాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతో ఐటి ఉద్యోగుల్లో కొంత మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు భావిస్తున్నారు.
డ్రగ్ రాకెట్ గుట్టురట్టు కావడంతో...
హైదరాబాద్లో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో బహుళజాతి ఐటి కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్లోని తమ శాఖల కార్యాలయాలకు అప్రమత్తత ఈ-మెయిల్స్ పంపించినట్లు సమాచారం. ఐటి, ఐటి ఆధారిత సాంకేతిక సేవలందించే కంపెనీలే కాకుండా బిపిఓలు, కెపిఓల్లో పని చేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది మద్యం, మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నట్లు కూడా తెలుస్తోంది.
పని ఒత్తిడి కారణం..
పని ఒత్తిడి, వృత్తిలో పోటీ, కాలపరిమితుల విధింపు తదితర కారణాల వల్ల మాదక ద్రవ్యాల వ్యసనానికి యువతి బానిస అవుతున్నట్లు భావిస్తున్నారు. మత్తుకు అలవాటు పడడానికి వీటితో పాటు పదోన్నతుల కోసం పోటీపడి పని చేయడం, వ్యక్తిగత రుణాలు, వాయిదాల చెల్లింపులు వంటి ఒత్తిళ్లు కూడా యువత వ్యసనానికి బానిస కావడానికి కారణమని అంటున్నారు.
పబ్బుల లైసెన్సులు రద్దు చేయాలి...
హైదరాబాద్లో ఉన్న పబ్ లైసెనులన్నీ రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి డ్రగ్స్ దందా అంటూ డ్రగ్స్ మాఫియాపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ఖండించారు. పబ్లను వ్యతిరేకిస్తూ పబ్ల వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పబ్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.
నాయిని ఇలా చెప్పారు....
డ్రగ్స్ మాఫియాపై ప్రభు త్వం లోతుగా దర్యాప్తు చేయిస్తోందని, అందులో టిఆర్ఎస్ నేతలున్నా, వారి వారసులున్నా వదిలేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖమ్మంలో శనివారం ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియా యా కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు. గతంలోనే డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసి వుంటే ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఇప్పటికే అనేకమందిని విచారిస్తున్నామని, పూర్తిస్థాయిలో విచారణ ముగిశాక దోషులను కఠినంగా శిక్షించేలా చూస్తామని చెప్పారు.