'అందం'గా లేనని ఆత్మహత్య: అమ్మాయిలకు నచ్చట్లేదని సూసైడ్ నోట్
తాను అందంగా లేకపోవడం వల్ల ఎవరితోనూ కలవలేకపోతున్నానని, అమ్మాయిలకు నచ్చడం లేదని, అందుకే చనిపోతున్నానంటూ అతను సూసైడ్ లేఖ రాశాడు.
బీబీనగర్: అందంగా లేనన్న ఆత్మన్యూనత భావనతో కుమిలిపోయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగరి జిల్లాలోని బీబీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి గతంలోను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సాయిగూడ గ్రామానికి చెందిన గుగులోతు గోపిచంద్ (21) బీబీనగర్ గూడూరు శివారులోని తూడి రాంరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే తాను అందంగా లేకపోవడం పట్ల గతకొంత కాలంగా గోపిచంద్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. తనలో తనే కుమిలిపోతున్నాడు. కేవలం అందంగా లేకపోవడం వల్లే అందరితోను కలవలేకపోతున్నానని, అమ్మాయిలకు తాను నచ్చడం లేదని బాధపడుతుండేవాడు.
ఇదే మానసిక వేదనతో గత సంవత్సరం డిసెంబర్ లో ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తు అప్పుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం సైతం అతనికి రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చింది. అయితే అవేవి గోపి మనస్తత్వాన్ని మార్చలేకపోయాయి. ఎప్పుడూ అదే బాధతో ఆత్మన్యూనతగా ఫీలయ్యేవాడు.
ఇదే నేపథ్యంలో ఆదివారం రాత్రి హాస్టల్లో ఎవరూ లేని సమయంలో గోపి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అందంగా లేకపోవడం వల్ల ఎవరితోనూ కలవలేకపోతున్నానని, అమ్మాయిలకు నచ్చడం లేదని, అందుకే చనిపోతున్నానంటూ అతను సూసైడ్ లేఖ రాశాడు. అమ్మ, నాన్నలు తనను క్షమించాలని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నాని అందులో పేర్కొన్నాడు.
అయితే సూసైడ్ నోట్ లో ఉన్న చేతి రాతల మధ్య తేడాలు ఉండటం.. అవి రెండు రకాలుగా కనిపిస్తుండటంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.