కాళ్లు పట్టుకుంటాం: ఎర్రబెల్లి, 'ఇదేంటి.. ధనిక రాష్ట్రమని కెసిఆర్, కాదని కెటిఆర్'
హైదరాబాద్/గజ్వెల్: రైతుల కోసం మేం ఓ మెట్టు దిగి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడుతున్నామని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చేతకాకుంటే చెప్పాలని, కేంద్రం కాళ్లు పట్టుకొని అయినా రైతు రుణమాఫీ చేయిస్తామని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా రైతు రుణమాఫీ చేయడం వల్ల రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతులకు ఏదో చేశామని కెసిఆర్ అంటున్నారు, అసలేం చేశారన్నారు.
కెసిఆర్ ఓ మాట, కెటిఆర్ది ఓ మాట: పొన్నం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతు గోడు పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కెసిఆర్ తీరు నీరో చక్రవర్తిలా ఉందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కెసిఆర్ చెబుతుంటే, ఆయన తనయుడు కెటిఆర్ మాత్రం దారిద్ర్యంలో ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో వారి మాటలకు పొంతన లేదన్నారు. రైతుల బాధలు లేవనెత్తితే తమను ఆంధ్రా తొత్తులని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు సిద్దం కావాలని సవాల్ చేశారు. త్వరలో జరిగే వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక రెఫరెండమేనన్నారు.
ప్రజ్ఞాపూర్లో టిడిపి బస్సుయాత్రకు ఘన స్వాగతం
రైతు కోసం బస్సుయాత్రను టిడిపి చేపట్టింది. దీనికి మెదక్ జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్లో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిజెపి, టిడిపి నేతలు ఆందోళన చేశారు.
కెసిఆర్ తన కొత్త కాన్వాయ్కు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని, రైతులను మాత్రం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయరని ప్రశ్నించారు. కెసిఆర్ సొంత జిల్లా, నియోజకవర్గంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయన్నారు.