దమ్ముంటే ఎన్నికలకు రా: కెసిఆర్కు ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్: దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిలకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సవాల్ చేశారు. శనివారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకునే పరిస్థితి కేసీఆర్కు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని, ద్రోహులను చేరదీస్తున్నందుకే అందరూ ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తెలంగాణ కోసం పోరాడినవారెవరూ లేరని అంటూ ఈ విషయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ప్రశ్నించాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యులు ఆత్మప్రబోధం మేరకు ఓటేయాలని ఆయన సూచించారు. అమరవీరుల కుటుంబాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి, టిడిపి శానససభ్యులతో చర్చించారు. ఆరు స్థానాలకు ఏడుగురు బరిలో మిగలడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యంగా మారాయి. నాలుగు స్థానాలను గెలుచుకునే సత్తా ఉన్న టిఆర్ఎస్ ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపింది.