ఆ ముగ్గురు గెలిస్తే రాజకీయసన్యాసం: ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డిలు తిరిగి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు శనివారం అన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన మాట్లాడారు.
గతంలో ఇతర పార్టీల నుండి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలు పెట్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే వారు ఎట్టి పరిస్థితుల్లో గెలవరన్నారు. అందుకే జరపడం లేదన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా నిర్వహించడం లేదన్నారు. తెరాసపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందన్నారు. రంగు మారిన పార్టీ తెరాస అని, కేసీఆర్ పచ్చి అవకాశవాది అని, పిట్టల దొర అని దుయ్యబట్టారు.
రానున్న శాసనసభ సమావేశాల్లో సీఎం, మంత్రుల అవినీతి అక్రమాలను ఎండగడుతామన్నారు. టీడీపీని ఆంధ్రాపార్టీగా చెబుతున్న కేసీఆర్, తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ పేరును తన కొడుకుకు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కొడుకు పేరును శ్రీకాంత చారిగా మార్చుకోవాలని సూచించారు.
మిషన్ కాకతీయ పేరుతో టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలపై సీఎం కేసీఆర్ వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో శనివారం దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు.