ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్ రెడ్డి: స్పీకర్కు వారు రాసిన లేఖలు ఇవీ..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు, టిడిపిఎల్పీ నేతగా నియమితులైన రేవంత్ రెడ్డి శుక్రవారం స్పీకర్ మధుసూదనాచారికి పోటాపోటీగా లేఖలు రాశారు. దీంతో టిడిఎల్పీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ టిడిపిని వీడిన ఎర్రబెల్లి దయాకరరావు సహా 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. తెరాసలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలూ ఈ లేఖపై సంతకాలు చేశారు. తెదేపా శాసన సభా పక్షం పేరుతోనే ఎర్రబెల్లి లేఖ ఇచ్చారు.
మరోవైపు తమ పార్టీని వీడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టిడిఎల్పీ కొత్త నేత రేవంతర్ రెడ్డి సభాపతికి లేఖ పంపారు. టిడిపి తరఫున బి ఫారం తీసుకుని ఎన్నికల్లో గెలిచిన వీరిని తెరాసలో విలీనం చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, రేవంత్రెడ్డిని టిడిఎల్పీ నేతగా గుర్తించినట్లు స్పీకర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో టిడిఎల్పీ భవితవ్యంపై సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఎర్రబెల్లి తదితరులు రాసిన లేఖ...
గౌరవనీయులైన సభాపతి గారికి,
తెదేపా శాసనసభా పక్షంలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. ఈ నెల 11న శాసనసభలో తెదేపా శాసనసభా పక్ష సభ్యులం పది మంది సమావేశమై తెరాసలో విలీనమవ్వాలనే అంశంపై చర్చించాం. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల పేర్లు ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, జి.సాయన్న, టి.ప్రకాష్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానందా, చల్లా ధర్మారెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు 4వ పేరా ప్రకారం... తెదేపా శాసనసభా పక్షం తెరాసలో విలీనం కావడానికి అవసరమైనంత సభ్యుల సంఖ్య కలిగి ఉన్నాం. ఈ మేరకు మా పదిమందిని తక్షణం తెరాస శాసనసభా పక్షంలో విలీనం అయినట్లుగా గుర్తించాలి. తెరాస ఎమ్మెల్యేల జాబితాలో సభ్యులుగా మా పేర్లను చూపాలి.
ఇట్లు,
మీ
విశ్వాసపాత్రులు
ఎర్రబెల్లి
దయాకరరావు
సహా
పదిమంది
ఎమ్మెల్యేలు
రేవంత్రెడ్డి సభాపతికి రాసిన లేఖ...
గౌరవనీయులైన సభాపతి గారికి,
ఎర్రబెల్లి దయాకరరావు, కె.వివేకానందా, టి.ప్రకాష్గౌడ్, ఎస్.రాజేందర్రెడ్డిలు టిడిపి తరఫున 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలు, ఎన్నికల ప్రణాళిక, కార్యక్రమాల ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి వారికి బి ఫారం ఇచ్చాము. వారు తెదేపా సభ్యులుగా కొనసాగుతున్నట్లుగా భారత ఎన్నికల కమిషన్ గుర్తించింది. వారు తెదేపా శాసనసభ పక్షంలోనూ సభ్యులు. వారు పార్టీపై అసమ్మతి తెలిపి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఇది అనైతికం, రాజ్యాంగ విరుద్ధం పైగా ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. రాజ్యాంగంలోని పదో షెడ్యూలుకు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వారు అత్రిమించారు. ఈ విషయాన్ని పరిశీలించి భారత రాజ్యాంగం ప్రకారం వారిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలి.
మీ
విశ్వాసపాత్రులు
రేవంత్రెడ్డి,
టీటీడీఎల్పీ
నేత