వరంగల్లో భారీ ట్యాంపరింగ్: టిఆర్ఎస్ గెలుపుపై సర్వే సవాల్, కెసిఆర్కు సారీ
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలలో భారీ ట్యాపరింగ్ జరిగిందని, దీని పైన విచారణ జరిపించాలని మాజీ కేంద్రమంత్రి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి సర్వే సత్యనారాయణ శుక్రవారం నాడు డిమాండ్ చేశారు.
వరంగల్లో టీఆర్ఎస్ విజయం నిజమైన ప్రజా తీర్పు కాదన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను టాంపంరింగ్ చేసి, టీఆర్ఎస్ గెలుపొందిందని ఆరోపించారు. కేవలం ఈ మోసం వల్లే టీఆర్ఎస్కు అంత ఎక్కువ ఆధిక్యత వచ్చిందన్నారు. ప్రజలు అడుగడుగునా ఆ పార్టీ నేతలను అఢ్డుకున్నారని గుర్తు చేశారు.
టాంపరింగ్ వల్లే తాను ఓడిపోయానన్నారు. ఈవీఎంలపై బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి అవకతవకలు జరగలేదంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను సలాం చేస్తానని సవాల్ చేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.
అందుకే మంత్రులను అనేక చోట్ల ప్రజలు నిలదీశారన్నారు. ఈవీఎంలలో అవతవకల పైన విచారణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు రోజుల్లో లేఖ రాయాలని సర్వే డిమాండ్ చేశారు. లేదంటే తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈవీఎంల మానిప్లేట్ పైన ప్రత్యేక కమిషన్తో బహిరంగ విచారణ జరగాలన్నారు.
ఈవీఎంలు కరెక్ట్ అని తేలితే తాను కెసిఆర్కు సలాం చేస్తానని, లేదంటే కెసిఆర్ రాజీనామా చేస్తారా అన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నుంచి టీఆర్ఎస్ ఈవీఎంల మానిప్లేట్ చేయడం ప్రారంభించిందన్నారు.
ప్రచారంలో కెసిఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ఉద్యమ సమయంలోను టిఆర్ఎస్కు ఇంత మెజార్టీ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకపోవడం వెనుక ఈవీఎంలను మానిప్లేట్ చేయడమే అన్నారు.
బెదిరించారు: వంటేరు
కెసిఆఱ్ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ రైతులను అవమానించేలా ఉందని తెలంగాణ టిడిపి నేత, తెలుగు రైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ అఫిడవిట్ను ఉపసంహరించుకోవాలన్నారు. రైతుల ఇళ్లలో శుభకార్యాలు జరగకుండదా, వాళ్ల పిలలను మంచి చదువులు చదివించుకోకుండదా అని ప్రశ్నించారు.