చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్పై మాజీ డిజిపి దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలీసులు డైరెక్టర్ జనరల్ (డిజిపి)గా పనిచేసిన దినేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫోన్ ట్యాప్ అయిందనే ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిఆర్ న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతోనూ తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, తనకు ఎవరి మీదా ఏ విధమైన పక్షపాత వైఖరి లేదని చెబుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ సన్ ఫోన్ను ట్యాప్ చేస్తే తప్పు లేదని, హైదరాబాదులో హోం శాఖ అనుమతితో ఫోన్లు ట్యాప్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలకు కూడా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు ఫోన్ను ట్యాప్ చేస్తే ఆ విషయంపై గవర్నర్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని, అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుందని, ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే గవర్నర్ హైదరాబాదు, సైబరాబాద్ పోలీసు కమిషనర్లపై చర్యలు తీసుకునే అధికారం తనకున్న విచక్షణాధికారాల మేరకు చర్యలు తీసుకోవడానికి గవర్నర్కు అధికారం ఉంటుందని ఆయన చెప్పారు.
హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ఎసిబి ఉన్నా, పోలీసు విభాగం ఉన్నా వాటి పరిధి తెలంగాణలో ఉండదని, ఉమ్మడి రాజధానిగా వాటి కేంద్ర కార్యాలయాలు మాత్రమే హైదరాబాదులో ఉంటాయని, వాటికి హైదరాబాదులో చర్యలు తీసుకునే అధికారం ఉండదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల్లో మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని ఆయన చెప్పారు.
చంద్రబాబు ఫోన్ ట్యాప్ జరిగి ఉంటే, ఆ విషయంపై హైదరాబాదులోనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రజల హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నర్దని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆ పరిధిలోకే వస్తారని, హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా ఆంధ్రప్రజల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు గవర్నర్ జోక్యం చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇంతగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.