నటి గౌతమి ఎగైన్ లైఫ్ ద్వారా చెల్లుచీటి: ఐటీకి డ్రగ్స్ మహమ్మరి
ప్రస్తుతం తెలంగాణలో సంచలనం స్రుష్టిస్తున్న ‘డ్రగ్స్’ కేసులో పలువురు సినీ ప్రముఖులతోపాటు ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న వందల మంది టెక్కీలు చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో సంచలనం స్రుష్టిస్తున్న 'డ్రగ్స్' కేసులో పలువురు సినీ ప్రముఖులతోపాటు ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న వందల మంది టెక్కీలు చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. సినీ ప్రముఖుల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఎక్సైజ్ శాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నటి గౌతమి హాసన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'గౌతమి ఎగైన్ లైఫ్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా త్వరలో పెద్దఎత్తున డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు యత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
దీనిద్వారా డ్రగ్స్ బాధితులందరికీ విముక్తి కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఐటీ ఇంజినీర్లు కూడా ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారని నిర్ధారించుకున్న ఎక్సైజ్ శాఖ సిట్.. ఈ మేరకు రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కు జాబితా అందజేసినట్లు సమాచారం.
కౌన్సిలింగ్ తో అవగాహనకు మార్గం ఇలా
ఆయా ఐటీ కంపెనీల్లోని క్యాంటిన్లే డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా మారాయని చెప్తున్నారు. ఈ తరుణంలో సినీ, ఐటీ నిపుణుల్లో డ్రగ్స్ కు బానిసలైన వారిని రక్షించేందుకు డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటు ఒక్కటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం. సినీ నటి గౌతమి ఇంతకు ముందు క్యాన్సర్ వ్యాధితో పోరాడి విజయం సాధించారు. తాజాగా క్యాన్సర్ బాధితులకు సేవలందిస్తున్నారు. ఆమె ద్వారా సినీ ప్రముఖులు, ఐటీ నిపుణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం తేలిక అవుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Recommended Video
ఐటీ రంగానికి విస్తరించిన డ్రగ్స్ మాఫియా
డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించిందా? టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారా? సాఫ్ట్వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్కు అడ్డాలుగా మారాయా? అవుననే అంటున్నారు ఎక్సైజ్ అధికారులు! సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడినట్లు సమాచారం. డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, విలియమ్స్, జీశాన్ల విచారణలో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పదుల కంపెనీల్లోని వందల మంది సిబ్బంది మత్తుకు బానిసయ్యారని స్వయంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. వారి జాబితా రూపొందించి రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్కు సమర్పించినట్టు పేర్కొన్నారు. తాము కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, డ్రగ్స్కు అలవాటు పడ్డవారందని విచారిస్తున్నామని స్పష్టంచేశారు. ఇప్పటిదాకా 27 మందికి నోటీసులు జారీ చేశామని, 12 మందిని సిట్ కార్యాలయంలో విచారిస్తుండగా.. మిగతా వారిని వివిధ ప్రాంతాల్లో సిట్ బృందాలు విచారిస్తున్నాయని అకున్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో హరితహారం, గుడుంబా రహిత రాష్ట్రం తదితర అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొన్న ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాతో ఇష్టాగోష్టిగా పలు విషయాలు చెప్పారు.
అలోవేరా జ్యూసి తాగి విచారణకు హాజరు
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులంతా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అకున్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బయటపడకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లకు బదులు అలోవేరా జ్యూసులు, విలువైన హోమియోపతి డ్రింక్స్ సేవిస్తున్నారని తెలిపారు. ఇక్కడ దొరకని డ్రింక్స్ను విదేశాల నుంచి ఆగమేఘాల మీద తెప్పించుకొని మరీ వాడుతున్నారని చెప్పారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇక వెంట్రుకల ద్వారా బయటపడకుండా ఉండేందుకు ఖరీదైన షాంపులతో తలస్నానం విచారణకు హాజరవతున్నారని తెలిపారు. పవర్ఫుల్ షాంపులు వాడితే డ్రగ్స్ ఆనవాళ్లు అంత పక్కాగా రావన్న అభిప్రాయంతో ఇలా చేస్తున్నట్టు వివరించారు.
విద్యార్థులకు డీ అడిక్షన్తోపాటు భారీగా అవగాహన
డ్రగ్స్కు బానిసైన విద్యార్థులను డీఅడిక్షన్ చేయడంతోపాటు భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అకున్ తెలిపారు. ఇప్పటికే అనేక పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నాయన్నారు. అందులో భాగంగా స్కూల్ లోపలికి సెల్ఫోన్లను నిషేధించారన్నారు. అలాగే కాల్డేటాపై కూడా తమ నిఘా ఉండటంతో ఏమాత్రం డ్రగ్స్ వైపు ఆలోచించడం లేదన్నారు. తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్యాకెట్ మనీకి కోత విధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లోని బాత్రూమ్ల్లో యాజమాన్యాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే తమ విభాగం, పోలీసు శాఖ వరుస దాడులు నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. దీంతో ప్రతిరోజు 300 నుంచి 400 కేజీల గంజాయి పట్టుబడుతోందన్నారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో రాష్ట్రంలోకి గంజాయి సరఫరా అవుతోందని చెప్పారు.
ఆధారాలు సంపాదించాకే తదుపరి విచారణ
విచారణ ఎదుర్కొంటున్నవారు.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల పేర్లు చెబుతున్నారని, సినీ రంగంలోని బడా నిర్మాతలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని వెల్లడిస్తున్నట్టు చంద్రవదన్ తెలిపారు. అయితే వారు చెబుతున్న అంశాల ఆధారంగా వెంటనే నోటీసులు ఇవ్వలేమని, వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చే ఆధారాలను సంపాదించే పనిలో సిట్ ఉందన్నారు. సినీ పరిశ్రమలో చీలిక ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయని, విచారణ ఎదుర్కొంటున్నవారు ఇంకో గ్రూపు వారి గురించి చెబుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలంగాణ-ఆంధ్రా అన్న భావనను కూడా తెరపైకి తెచ్చే యత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్ తీసుకున్న వారిని సులభంగా గుర్తించేందుకు అథ్లెటిక్స్కు ఉపయోగించే డోపింగ్ టెస్ట్ మిషన్ను ఢిల్లీ నుంచి తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల అది కుదరలేదని చంద్రవదన్ చెప్పారు. డ్రగ్ కేసులో ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు.