మా వల్లే.. చీప్ లిక్కర్పై తగ్గిన కెసిఆర్! ఇప్పుడు చైనాకు అవసరమా: నాగం
హైదరాబాద్/వరంగల్: చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వం యోచన పైన గురువారం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తమ పార్టీ ప్రకటించడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ ప్రతిపాదనను వాయిదా వేసుకున్నారని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
చీప్ లిక్కర్ ప్రతిపాదన పైన బుధవారం తెలంగాణ కేబినెట్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. పాత విధానమే ఈసారి కొనసాగనుంది. చీప్ లిక్కర్ ప్రవేశ పెడతామన్న ప్రభుత్వం పైన విపక్షాలు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున నిరసన రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఈ నేపథ్యంలో దీనిపై ఎర్రబెల్లి మాట్లాడారు. చీప్ లిక్కర్ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకించామని, పోరాడామని చెప్పారు. టిడిపి హెచ్చరిక వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.
ప్రమాదంలో పడింది బీజేపీయే: శ్రీనివాస్ గౌడ్
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఏ మాత్రం వాస్తవం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రమాదంలో పడింది బీజేపీయేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కిషన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు నిధులు రప్పించడంలో ఆయన విఫలమయ్యారన్నారు. నిధుల కోసం కేంద్రాన్ని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. మా వల్లే చీప్ లిక్కర్ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విపక్షాలు చెప్పడం విడ్డూరమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అడ్డుకున్నా తగ్గం: కిషన్ రెడ్డి
పెండింగు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు సామరస్యంగా ఉద్యమిస్తుంటే అరెస్టులు చేయిస్తున్నారన్నారు. అడ్డుకున్నా తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
రైతలును ఆదుకోవాలి, రుణమాఫీపై క్లారిటీ లేదు: భట్టి, నాగం
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
కరవును ఎదుర్కోవడంలో కెసిఆర్ విఫలమయ్యారని నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. కరవు జిల్లాల పైన కేంద్రానికి నివేదిక ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉంటే చైనా పర్యటన అవసరమా అన్నారు. మిషన్ కాకతీయతో కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు బాగుపడ్డారన్నారు. జిల్లాల్లో భరోసా యాత్ర చేపడతానని, రైతులకు భరోసా ఇస్తామన్నారు.