క్యాబ్లో 'రేప్'యత్నం: అక్రమ సంబంధం.. కారు లోపల జరిగింది ఇది?
క్యాబ్ లోనే తనను దూషిస్తూ.. చేయి చేసుకోవడంతో.. ఎక్కడ తనపై దాడికి పాల్పడుతాడోనన్న భయంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధిత మహిళ చెప్పింది.
హైదరాబాద్: క్యాబ్లో మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారన్న వార్త శుక్రవారం తెల్లవారు జామున మీడియాలో ప్రసారమైంది. అంతకుముందు గురువారం అర్థరాత్రి బాధితురాలు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. నిందితులతో పాటు మహిళను క్షుణ్ణంగా విచారించిన పోలీసులు.. అసలు నిజాలు రాబట్టారు.
వివాహేతర సంబంధం.. సహజీవనం చేస్తున్న వ్యక్తి తనపై పెంచుకున్న అనుమానమే ఆమెకు ఈ దుస్థితి కల్పించినట్లు తెలుస్తోంది. క్యాబ్ లోనే మద్యం తాగి తనను దూషించడంతో పాటు చేయి కూడా చేసుకోవడం ఆమెకు ఏదో తేడా జరుగుతుందన్న అనుమానాలను కలిగించింది. క్యాబ్ లో ప్రియుడి స్నేహితుడు మరొకరు కూడా ఉండటంతో.. ఎందుకైనా మంచిదని పోలీసులకు ఆమె సమాచారం అందించినట్లు చెబుతున్నారు.
ఇదీ నేపథ్యం:
హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టకు చెందిన వివాహిత(27) గతంలో మలక్పేట రేస్ కోర్సులో కొన్నాళ్లు పని చేసింది. ఆ సమయంలో నాంపల్లికి చెందిన టింబర్ డిపో వ్యాపారి శ్రీకాంత్ (40)తో అక్కడ పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో.. అప్పటి నుంచి భర్తకు దూరంగా శ్రీకాంత్ తోను సహజీవనం చేస్తోంది.
Recommended Video
గురువారం ఎక్కడికి వెళ్లింది?:
గురువారం ఉదయం 11 గం. సమయంలో జగద్గిరి గుట్ట నుంచి కాజీపేటకు బయలుదేరింది. కాజీపేటలోని గణపతి దేవాలయంలో దర్శనం కోసం వెళ్లింది. అయితే ఆమెపై అనుమానంతో ఉన్న శ్రీకాంత్.. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని వెనకాలే ఫాలో అయ్యే ప్రయత్నం చేశాడు.
స్నేహితుడు అజార్ ను వెంటపెట్టుకుని ఓ క్యాబ్ రెంట్ తీసుకుని కాజీపేట బయలుదేరారు. అప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న ఆమెను తిరిగి క్యాబ్ లో ఎక్కించుకుని హైదరాబాద్ వైపు బయలుదేరారు.
ఎవరితో సంబంధం పెట్టుకున్నావని?:
క్యాబ్ లో హైదరాబాద్ కు తిరుగు పయనమైన తర్వాత.. జనగామ వద్ద మద్యం సీసాలను శ్రీకాoత్ కొనుగోలు చేశాడు. క్యాబ్ లోనే తాగుతూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఎవరితో సంబంధం ఉంది?, ఎప్పుడూ ఎందుకెళ్తున్నావ్ కాజీపేటకు? అని ప్రశ్నలతో వేధించాడు.
దర్శనం కోసమే వెళ్లానని చెప్పినా వినకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. అలా ఆమెపై రెండు మూడుసార్లు చేయి చేసుకుని ఇష్టమొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు. శ్రీకాంత్ వేధింపులు ఎక్కువవడంతో ఆమె మనసులో ఏదో కీడు శంకించింది.
క్యాబ్ డ్రైవర్ ను అడిగి:
మనసు కీడు శంకించడంతో.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహిళ భావించింది. రాత్రి 11గం. సమయంలో ఎక్కడివరకు వచ్చామని క్యాబ్ డ్రైవర్ ను అడిగింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మెసేజ్ పెట్టింది. సందేశం అందుకున్న కంట్రోల్ రూమ్ పోలీసులు వెంటనే ఘట్ కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే క్యాబ్ ఘట్ కేసర్ దాటి ఉప్పల్ వైపు వెళ్లిపోవడంతో.. మరోసారి ఆమె కంట్రోల్ రూమ్ కు మెసేజ్ పెట్టింది.
ఉస్మానియా వర్సిటీ పోలీసులు:
మరోసారి మెసేజ్ రావడంతో అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ పోలీసులు.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. కారు తార్నాక వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఉస్మానియా పోలీసులకు సమాచారం అందించడంతో.. సిగ్నల్ పాయింట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఆమె ఉన్న వాహనాన్ని గర్తించారు.ఆపై ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పంపించినట్లు సమాచారం.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్పై 354, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ ప్రకాష్ తెలిపారు. మహిళపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
భయపెట్టేందుకే ఫోన్:
క్యాబ్ లోనే తనను దూషిస్తూ.. చేయి చేసుకోవడంతో.. ఎక్కడ తనపై దాడికి పాల్పడుతాడోనన్న భయంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధిత మహిళ చెప్పింది. దాడి చేస్తున్నారని చెబితే పోలీసులు స్పందించరన్న ఉద్దేశంతో.. క్యాబ్లో ముగ్గురు వ్యక్తులు తనపై ఆత్యాచారానికి యత్నిస్తున్నారని మెసేజ్ పంపించినట్లు ఒప్పుకుంది. శ్రీకాంత్ పై ఎలాంటి కేసుపెట్టవద్దని ఆమె కోరడం గమనార్హం.