రోగి ప్రాణం తీసి, శవాన్ని కాల్చేయడానికి చూసిన డాక్టర్ ఇతనే
హైదరాబాద్: రోగి ప్రాణం పోవడంతో శవాన్ని శంషాబాద్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కాల్చివేయడానికి ప్రయత్నించిన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసు విచారణలో అతను నకిలీ వైద్యుడని కూడా తెలింది. ఇంటర్మీడియట్ వరకు చదివి వైద్య వృత్తితో సంబంధం లేకున్నా వైద్యుడిగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి అతను కారణమయ్యాడు.
ఇస్మాయిల్ హుస్సేన్ అనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాదు పాతబస్తీలోని శాలిబండకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ హుస్సేన్ (39)కి వైద్యం తెలియదు. ఇతడు గతంలో ఓ ఆస్పత్రిలో పనిచేశాడు. అదే అనుభవంతో అతను యునానీ వైద్యుడినంటూ పరిచయం చేసుకుని శాలిబండలో ఓ క్లినిక్ తెరిచాడు.
స్థానికంగా నివాసం ఉండే నహీముద్దీన్ ఇతని వద్దకు అప్పుడప్పుడు వైద్యానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం నహీముద్దీన్ అనారోగ్యంతో ఇస్మాయిల్ వద్దకు వెళ్లాడు. అతనికి ఇస్మాయిల్ ఏదో మందు ఇచ్చాడు. మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో నహీముద్దీన్ ఆపస్మారక స్థితిలోకి జారుకుని ప్రాణాలు వదిలాడు.
దాంతో ఆందోళనకు గురైన ఇస్మాయిల్ మృతదేహాన్ని తీసుకుని శంషాబాద్ శివారు ప్రాంతంలో అదే రోజు రాత్రి 10 గంటలకు వచ్చాడు. ఆర్జిఐఎ పోలీసు స్టేషన్ పరిధిలోని సాతంరాయి గ్రామ పరిధిలో గల నిర్మానుష్యమైన ప్రాంతంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇస్మాయిల్ ఏ విధమైన వైద్య విద్య చదువలేదని తమ విచారణలో తేలినట్లు డిసిపి శ్రీనివాస్ చెప్పారు. యునాని వైద్యుడిగా చెబుకుంటున్న అతని వద్ద ఉన్నవి నకిలీ ధ్రువీకరణ పత్రాలని గుర్తించినట్లు తెలిపారు.